
సౌరగిరి వికాసం రైతులకు ప్రత్యేక శిక్షణ
నాగర్ర్నూల్: ఇందిరా సౌర గిరి వికాసం పథకం రైతులకు రాష్ట్రస్థాయి ఉద్యాన పరిశోధన కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తామని, దీనిని సద్వినియోగం చేసుకొని నల్లమలలోని గిరిజన రైతులు రాష్ట్రస్థాయి శిక్షకులుగా మారాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఉద్యాన పంటలపై పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన తర్వాత రాష్ట్రస్థాయిలో వారి సేవలు అందేలా చూస్తామన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఇందిరా సౌర గిరి జల వికాసం లబ్ధిదారులు రాజకుమార్, లక్ష్మి, అలివేలతో కలెక్టర్ మాట్లాడారు. పాలెం కేవీకే, నల్లగొండ మల్లేపల్లి ఉద్యాన శిక్షణ కేంద్రం, సంగారెడ్డి ఉద్యాన శిక్షణ, పరిశోధన కేంద్రాల్లో ఉద్యాన పంటలపై శిక్షణ ఇస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ద్వారా ఆదివాసీ, గిరిజన రైతులు ఆర్థిక అభ్యున్నతి సాధించేలా కృషి చేయాలని, ఆ దిశగా శిక్షణ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఉద్యాన పంటలతోపాటు మామిడి, అవకాడ, బత్తాయి, జీడి మామిడి, కొబ్బరి, జామ, సీతాఫలం, నిమ్మ, నేరేడు, రేగు, మునగ, గులాబీ, మల్లె వంటి పూలు, ఆయుర్వేద, సుగంధ తైల మొక్కల సాగు, మార్కెటింగ్ తదితర అంశాలపై శిక్షణ ఇస్తారన్నారు. ఈ పథకం కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని చెప్పారు. అంతిమంగా ఈ సమగ్ర కృషి నల్లమల ప్రాంతాన్ని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
రికార్డు స్థాయిలో వరిధాన్యం సేకరణ
జిల్లాలో రికార్డు స్థాయిలో వరిధాన్యం సేకరించామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు చేయగా.. 3 లక్షల మె.ట., ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. ఇప్పటి వరకు 28,705 మంది రైతుల నుంచి 1,71,694 మె.ట., ధాన్యం కొనుగోలు చేశామని, ఇందులో 26,314 మంది రైతులకు రూ.335 కోట్లు ఖాతాలో జమ చేశామన్నారు. జిల్లాలో ఇంకా 10 వేల మె.ట., ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉందని, రానున్న రెండు మూడు రోజుల్లోనే కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
భూ సేకరణలో వేగం పెంచాలి
జిల్లాలో కేఎస్ఐ, పాలమూరు– రంగారెడ్డి, మార్కండేయ, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తదితర నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గత వారం నిర్దేశించిన మేరకు భూ సేకరణ పనులను ప్రాజెక్టుల వారీగా సమీక్షించారు. వచ్చేవారం వరకు మరింత పురోగతి సాధించాలని సూచించారు.