
రైతుల అనుమతి లేని రిజర్వాయర్ వద్దు
బల్మూర్: మండల కేంద్రం సమీపంలో నిర్మించతలపెట్టిన ఉమామహేశ్వర రిజర్వాయర్ను రైతుల అనుమతి లేకుండా చేపట్టవద్దని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు అన్నారు. శుక్రవారం రిజర్వాయర్ నిర్మాణంతో భూములు కోల్పోయే రైతులతో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బల్మూర్, అనంతవరం, మైలారం, అంబగిరి గ్రామాలకు చెందిన 2,601 ఎకరాల భూములను ఈ రిజర్వాయర్ నిర్మాణంలో కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. అయినా కూడా ఇప్పటి వరకు రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సర్వేలు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. రైతులను మోసం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దీనిపై తిరుగుబాటు ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఇక్కడ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టే బదులు గొలుసు కట్టు చెరువుల ద్వారా రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి నర్సింహులు, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి శంకర్నాయక్, నాయకులు నాగరాజు, శివకుమార్, సైదులు, రాజేష్, అంతయ్య తదితరులు పాల్గొన్నారు.