
రైతులకు సౌర పంట
వందశాతం సబ్సిడీపై అందజేయనున్న ప్రభుత్వం
●
అవగాహన కల్పిస్తాం..
అచ్చంపేట నియోజకవర్గాన్ని సీఎం రేవంత్రెడ్డి పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం సంతోషంగా ఉంది. మొదట వ్యవసాయ పంపు సెట్లకు సౌర విద్యుత్ కల్పిస్తాం. రెండో విడతలో ఇళ్లకు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సౌర విద్యుత్ ఏర్పాటుపై రైతులకు అవగాహన కల్పిస్తాం. దీని వల్ల ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుంది. వందశాతం సబ్సిడీపై ఇవ్వనుండటంతో రైతులకు ఒక్క రూపాయి ఖర్చు కాదు.
– వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట
● సొంత భూముల్లో పంపుసెట్లు,
ప్లాంట్లు ఏర్పాటుకు ప్రోత్సాహం
● వ్యవసాయ కనెక్షన్ల వివరాలు
సేకరిస్తున్న ట్రాన్స్కో అధికారులు
● పైలెట్ ప్రాజెక్టు కింద అచ్చంపేట ఎంపిక
● రూ.1,389.19 కోట్లు
కేటాయించిన ప్రభుత్వం
అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్పై ప్రత్యేక దృష్టిసారించింది. వ్యవసాయ పంపుసెట్లకు సౌర విద్యుత్ కల్పించేందుకు చొరవ తీసుకుంటుంది. ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన అచ్చంపేటను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. వందరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం ఆదేశాల మేరకు ట్రాన్స్కో అధికారులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు లెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. మొదట వ్యవసాయ రంగానికి, తర్వాత గృహా అవసరాలకు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. వినియోగదారుల అవసరాల తర్వాత మిగులు విద్యుత్ను తిరిగి ట్రాన్స్కో అమ్ముకోవడం ద్వారా ప్రతి కుటుంబం నెలకు రూ.3– 6 వేల వరకు ఆదాయం వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికి రోల్మోడల్గా చూపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వందశాతం సబ్సిడీతో సౌర విద్యుత్ కల్పిస్తోంది. ఇందులో సోలార్ ప్యానల్స్, కన్వెర్టర్ కంట్రోలర్ ఇవ్వనున్నారు.
కొండారెడ్డిపల్లిలో 420 ఇళ్లు..
ఇప్పటికే సీఎం స్వగ్రామం వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో వ్యవసాయ బోర్లు, ఇళ్లకు ఉచితంగా సోలార్ ద్వారా విద్యుత్ అందించే కార్యక్రమం నాలుగు నెలలుగా ముమ్మరంగా సాగుతుంది. గ్రామంలో 499 కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 420 ఇళ్లకు సౌర విద్యుత్ సదుపాయం కల్పించారు. మరో 79 ఇళ్లకు సంబంధించి మట్టి మిద్దెలు, రేకుల ఇళ్లు ఉండటంతో ఏర్పాటు కాలేదు. వీటికి కూడా స్టాండ్స్ మార్చి, ఖాళీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 21 ఇళ్లకు 2 కిలోవాట్లు, 9 ఇళ్లకు ఒక కిలోవాట్, 390 ఇళ్లకు 3 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్యానళ్లు ఏర్పాటు చేశారు. సౌర విద్యుత్కు తెలంగాణ పునరుత్పాదన ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో)ఇప్పటి వరకు సుమారు రూ.8.55 కోట్లు ఖర్చు చేసింది. దీంతో గ్రామంలో ఇంటింటా సౌర విద్యుత్ కాంతులు విరజిమ్ముతున్నాయి. అలాగే గ్రామంలో 941 వ్యవసాయ బోర్లు ఉండగా.. వీటికి సోలార్ విద్యుత్ కల్పించాల్సి ఉంది.
వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులు 5 హెచ్పీ నుంచి 7 హెచ్పీ బోరు మోటార్లు వినియోగిస్తుంటారు. వీటికి 5 లేదా 7.5 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్యానళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదే ఇళ్లకు అయితే 2 నుంచి 3 కిలోవాట్ల ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక కిలోవాట్కు రూ.65 నుంచి రూ.70 వేల ఖర్చు వస్తుండగా రోజుకు 4 యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. 3 కిలోవాట్కు కేంద్రం రూ.78 వేలు రాయితీ ఇస్తుంది. వ్యవసాయానికి 5 కిలోవాట్ల ప్యానల్, కన్వెర్టర్ కంట్రోలర్తో కలిపి రూ.3.50 లక్షల ఖర్చు వస్తోంది. నెలకు 600 యూనిట్ల వరకు విద్యుదుత్పత్తి చేయవచ్చు.
5–7.5 కిలోవాట్ల సామర్థ్యం
సొంత భూముల్లో..
ఎస్హెచ్జీలు, రైతులు వ్యక్తిగతంగా లేదా ఇతరులతో కలిసి తమ పొలాల్లో 0.5 మెగావాట్లు నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆర్థిక స్థోమత లేకుంటే డెవలపర్లకు తమ భూములను లీజుకు ఇచ్చి ప్లాంట్లు పెట్టించవచ్చు. లీజుకు ఇస్తే లీజు డబ్బును డిస్కంలు నేరుగా రైతు ఖాతాల్లో జమ చేస్తాయి. ఒక మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు 4 ఎకరాల స్థలం అవసరం. ఈ ప్లాంట్లు ఉత్పత్తి చేసే విద్యుత్ను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 25 ఏళ్లపాటు కొనుగోలు చేసే విధంగా ఒప్పందం చేసుకోనున్నాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) నిర్ణయించిన ధర ప్రకారం యూనిట్ విద్యుత్కు రూ.3.13 చొప్పున రైతులకు డిస్కంలు చెల్లిస్తాయి. భవిష్యత్లో ఈఆర్సీ నిర్ణయం మేరకు ఈ ధరల్లో మార్పులుంటాయి. ఒక మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంటు ద్వారా ఏటా సగటున 15– 16 లక్షల యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. తద్వారా సోలార్ ఏర్పాటు చేసుకునే వారికి రూ.45–50 లక్షల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేశారు.

రైతులకు సౌర పంట

రైతులకు సౌర పంట