● రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి
ధనసరి సీతక్క
ములుగు: జిల్లా కేంద్రంలో రూ.4.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీర్లు, కాంట్రాక్టర్లను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఆదేశించారు. ఈ మేరకు మంత్రి శనివారం బస్టాండ్ నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించి పనుల పురోగతిపై అధికారులతో ఫోన్లో మాట్లాడారు. నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఆధునిక సదుపాయాలతో కూడిన రవాణా సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. నూతన బస్టాండ్లో ప్రయాణికుల కోసం తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ సదుపాయాలు కల్పించనున్నట్లు వివరించారు. జిల్లా అభివృద్ధిలో బస్టాండ్ కీలక పాత్ర పోషిస్తుందని, నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రజలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుందని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కల్యాణి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సీతక్కకు ఉత్తమ సేవా పురస్కార్ అవార్డు
కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవలందించినందుకు గాను మంత్రి సీతక్కకు ఉత్తమ సేవా పురస్కార్ అవార్డును శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేయనున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఏప్రిల్ 24న హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా అవార్డుకు సంబంధించిన వాల్పోస్టర్ను మంత్రి సీతక్కతో కలిసి ఫౌండేషన్ ప్రతినిధులు ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర బడ్జెట్లో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు గాను సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు.


