ఏటూరునాగారం: ఐటీడీఏ ఏటూరునాగారంలో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి – గిరివాణి(గిరిజన దర్బార్) కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ టీఎస్.దివాకర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రేపు(సోమవారం) ఏటూరునాగారంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లాలోని గిరిజనులు, గిరిజనేతరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ అర్జీలను సమర్పించాలని కోరారు. జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు.
రామప్ప, హేమాచలక్షేత్రంలో జడ్జి ప్రత్యేక పూజలు
వెంకటాపురం(ఎం)/ మంగపేట: జిల్లాలోని రామప్ప, హేమాచలక్షేత్రంలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి తన కుటుంబ సభ్యులతో శనివారం సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత రామప్పను సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ మండపంలో రామప్ప ఈఓ ఇమ్మడి భాస్కర్ వారిని శాలువాలతో సత్కరించి స్వామివారి శేష వస్త్రాలను బహుకరించారు. ఆలయ విశిష్టత గురించి టూరిజం గైడ్ గోరంటాల విజయ్ కుమార్ వివరించారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు. అనంతరం మంగపేట మండల పరిధిలోని శ్రీహేమాచల లక్ష్మీనర్సింహాస్వామి ఆలయాన్ని జడ్జి సూర్యచంద్రకళ తన బంధువులతో కలిసి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయ కార్యనిర్వహణ అధికారి రేవెల్లి మహేశ్ ఆధ్వర్యంలో ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలతో ఆలయానికి ఆహ్వానించి ఆమె పేరిట స్వయంభు స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. అనంతరం ఆలయ పురాణం, స్వామివారి విశిష్టతను వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. మొదటి సారిగా ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయ ఈఓ మహేశ్ స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు.


