ఏటూరునాగారం: జిల్లాలో గ్యాస్ కొరత లేదని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘గుదిబండ’ కథనానికి జిల్లా యంత్రాంగం కదిలింది. ఈ మేరకు కలెక్టర్ దివాకర టీఎస్ మండల కేంద్రంలోని జీసీసీ గ్యాస్ గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా సివిల్ సప్లయీస్ అధికారిణి కృష్ణవేణి, జీసీసీ డీఎం వాణి, డీటీ విజయ్కుమార్, సర్పంచ్ కాకులమర్రి శ్రీలతో క లిసి గ్యాస్ సరఫరా కేంద్రం పరిస్థితిని పరిశీలించారు. సిలిండర్లు ఎందుకు కొరత వచ్చిందని, ఎప్ప టి నుంచి ఈ సమస్య ఉంటుందని జీసీసీ డీఎం వాణిని ప్రశ్నించారు. ఈనెల 7వ తేదీ నుంచి పెండింగ్లో ఉన్నాయని, సరఫరా ఆలస్యం అయిందని చెప్పడంతో అధికారిణిపై మండిపడ్డారు. గ్యాస్ సరఫరా విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని ముందుగానే హెచ్చరించామని, సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడ్డారు. గ్యాస్ సరఫరాలో ప్రజలు ఒకరకమైన అనుమానాలు పెట్టుకున్నారని, దానిని నివృత్తి చేయడానికి ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేపట్టిందని, దానిని మైక్ల ద్వారా ప్రజలకు ఎందుకు ప్రచారం చేయలేదని అసహనం వ్యక్తం చేశారు.
సిలిండర్ బుకింగ్కు 45 రోజుల సమయం..
జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ బుకింగ్, సరఫరా ప్రక్రియలో ప్రజలు అవగాహనతో వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. గ్యాస్ బుకింగ్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనల ప్రకారం ప్రతీ సిలిండర్ బుకింగ్కు మధ్య 45 రోజుల గ్యాప్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ గడువు పూర్తికాకముందు మళ్లీ బుకింగ్ చేయడానికి ప్రయత్నిస్తే ఓటీపీ నంబర్ రాదన్నారు. ప్రజలు అనవసరంగా గ్యాస్ ఏజెన్సీ కేంద్రాల వద్దకు రావొద్దని సూచించారు.
జిల్లాలో 86,896 కనెక్షన్లు
జిల్లాలో 8 ఏజెన్సీల పరిధిలో గృహ అవసరాలకు సంబంధించినవి 86,896, వాణిజ్య అవసరాలకు సంబంధించినవి 254 గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప్రతీరోజు సుమారు 943 గృహ అవసరాల గ్యాస్ బుకింగ్లు జరుగుతున్నట్లు చెప్పారు. గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలు భవిష్యత్లో గ్యాస్ కొరత రావొచ్చనే అనుమానాలతో ముందుగానే బుక్ చేసుకోవడంతో ఆయా గ్యాస్ ఏజెన్సీల వద్ద విని యోగదారులు సిలిండర్ల కోసం బారులు తీరాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు, ఉపసర్పంచ్ ఎల్లయ్య, వార్డు సభ్యులు చిన్ని, కిరణ్, రా మకృష్ణ, పంచాయతీ కార్యదర్శి రమాదేవి, లక్ష్మీనా రాయణ, సుధాకర్, జీసీసీ సిబ్బంది సాంబారావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గోదాం వద్దకు
వినియోగదారులు వెళ్లొద్దు
మీ ఇంటికే పంపిస్తాం
బుక్ చేసుకొని ఉంటే చాలు..
ఓటీపీలు గ్యాస్ వచ్చినప్పుడే చెప్పాలి
కలెక్టర్ దివాకర టీఎస్


