కన్నాయిగూడెం: కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామంలోని గోదావరిపై నిర్మించిన సమ్మక్క సా గర్ బ్యారేజీ నీటి నిల్వ తో నిండుకుండను తలపిస్తుంది. ఎగువ నుంచి బ్యారేజీలోకి 5,500 క్యూసెక్కుల నీరు చేరుతుండంతో బ్యారేజీ ప్రాంతం నీటితో జలకళను తలపిస్తుంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 83 మీటర్ల నీటి మట్టం కొనసాగుతుంది. కాగా గుట్టలగంగారంలోని దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల వద్ద నీటి పంపింగ్ గత కొన్ని రోజుల నుంచి కొనసాగుతుంది. వేసవి కాలం కావడంతో దిగువన తాగు నీటి వినియోగం పెరగడంతో పాటు యాసంగి పంటల సాగుకు నీటి వినియోగం పెరిగింది. దీంతో పంపింగ్ వద్ద మూడు ఫేజ్లలో పది మోటార్లు ఉండగా ఫేజ్ టులో ఉన్న రెండు మోటార్లలో ఒక మోటారును, ఫేజ్ త్రీలో ఆరు మోటార్లు ఉండగా ఐదు మోటార్లతో అధికారులు నీటిని దిగువకు జిల్లా పరిధిలోని గొల్లబుద్దారం రిజర్వాయర్లోకి తరలిస్తున్నారు. మొత్తం ఆరు మోటార్లతో 1,706 క్యూసెక్కుల నీటిని దిగువకు తరలిస్తున్నట్లు అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి. నీటి వినియోగం పెరిగితే మిగతా మోటార్లను ఆన్ చేసి పంపింగ్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలుపుతున్నారు.
వెంకటాపురం (ఎం): తెలంగాణ పర్యాటక ప్రాంతాల విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో యూకేకు చెందిన అంతర్జాతీయ ట్రావెల్ రైటర్ రాబర్ట్ పార్కర్ సోమవారం జిల్లాలోని ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ట్రావెల్ రైటర్ రాబర్ట్ పార్కర్ పర్యటన సందర్భంగా అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ సూర్యకిరణ్ కాకతీయుల కళా సంపద, రామప్ప శిల్పకళా వైభవం, ప్రపంచ వారసత్వ గుర్తింపు రామప్ప దేవాలయానికి ఏ విధంగా వచ్చింది, దేవాలయ ప్రాముఖ్యత, ప్లోటింగ్ బ్రిక్స్, సౌండ్ బాక్స్ టెక్నాలజీ, పేరిణి శివతాండవం, పర్యాటక ప్రాముఖ్యతపై రాబర్ట్ పార్కర్కు వివరించారు. తెలంగాణను ఎందుకు సందర్శించాలనే అంశంపై పర్యాటక అవకాశాలు, సాంస్కృతిక సంపద, వివిధ రకాల స్థానిక వంటకాల ప్రత్యేకతలపై ఆయనకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రతినిధి కల్యాణ్, టూరిజం గైడ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.
లక్నవరంలో..
గోవిందరావుపేట: లక్నవరం ప్రకృతి సోయగాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అంతర్జాతీయ ట్రావెల్ రైటర్ రాబర్ట్ పార్కర్ అన్నారు. సోమవారం మండలపరిధిలోని లక్నవరం సరస్సును లక్నవరం టూరిజం మేనేజర్ సండ్రపా టి శివశంకర్ ఆధ్వర్యంలో సందర్శించారు. ఆయన వెంట అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ సూర్యకిరణ్, తదితరులు ఉన్నారు.


