ములుగు: మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుతో పాటు తోఫా అందిస్తుందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు, తోఫా పంపిణీ కార్యక్రమానికి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముస్లిం మత పెద్దలతో, సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రజా ప్రభుత్వం మొదటి నుంచి మత సామరస్యానికి, లౌకిక వాదానికి కట్టుబడి ఉందని తెలిపారు. అన్ని కులాలు, మతాలను సమానంగా గౌరవిస్తూ, రాజ్యాంగం కల్పించిన లౌకిక స్ఫూర్తిని కాపాడుతుందని వెల్లడించారు. పాలకులు ప్రజలందరినీ సమానంగా చూడాలన్నారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలే తప్పా విద్వేషాలు రెచ్చగొట్టకూడదని హితవు పలికారు. ఈ సందర్భంగా మంత్రి ముస్లిం మత పెద్దలకు, మైనార్టీ సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలను మంత్రి సీతక్క తెలియజేశారు. అనంతరం కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి మైనారిటీ సోదరులందరికీ ఈద్ కా తోఫా కానుకలను అందజేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, మున్సిపాలిటీ చైర్పర్సన్ చింత నిప్పుల చంద్రకళ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల ఆశోక్, నాయకులు భగవాన్రెడ్డి, వంగ రవియాదవ్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ
మంత్రి సీతక్క


