ఎస్ఎస్ తాడ్వాయి : మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెలపై చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ దివాకర టీఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులు, 99 రోజుల ప్రజా ప్రణాళిక ప్రగతి పాలనలో భాగంగా శుక్రవారం కలెక్టర్ దివాకర టీఎస్ ఊరట్టం గ్రామపంచాయతీ కొత్తూరు హ్యాబిటేషన్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా మేడారంలోని సమ్మక్క సారలమ్మ వనదేవతల గద్దెలపై చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని, గద్దెల ప్రాంగణంలో డ్రెయినేజీ సమస్య పునరావృతం కాకుండా చూడాలని, ఆలయ రిలేయింగ్ ఫ్లోరింగ్ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 99 రోజుల ప్రజా ప్రణా ళిక ప్రగతి పాలనలో భాగంగా ఊరట్టం గ్రామపంచాయతీ కొత్తూరు హ్యాబిటేషన్లో జరుగుతున్న పరిశుభ్రత కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. వివిధ దశల్లో ఇళ్లను త్వరగా పూర్తి చేసుకొని ఉగాది పండగ వరకు గృహ ప్రవేశాలు చేయాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి, కేంద్రంలోని చిన్నారులకు యూనిఫారం పంపిణీ చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, స్టాక్ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వీరస్వామి, డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీధర్, ఆర్అండ్బీ డీఈ, అంగన్వాడీ టీచర్లు రోహిణి, ఊరట్టం సర్పంచ్ కోరం శైలజ, వెంకటేష్ నాగమణి, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలి
గోవిందరావుపేట: ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. 99 రోజుల ప్రజా ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఆయన పస్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హాజరు పట్టికను పరిశీలించి, ఆరోగ్య కేంద్రానికి వైద్యులు, సిబ్బంది సమయానికి రావాలని తెలిపారు. ఆస్పత్రి పరిసరాలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చిన ప్రజలు వేచి ఉండే పరిస్థితి రాకుండా ఎప్పటికప్పుడు వైద్యసేవలు అందించాలని తెలిపారు. గర్భిణులకు పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచేలా అవగాహన కల్పించాలని, ఫార్మా స్టాక్ రిజిస్టర్ను ప్రతీరోజు అప్డేట్ చేయాలని ఫార్మసిస్ట్కు సూచించారు. ఆరోగ్య కేంద్రంలో నిరుపయోగ పరికరాలను తొలగించాలని తెలిపారు. ఆస్పత్రి వార్డులు, వాష్ రూమ్లను నిరంతరం శుభ్రం చేయించాలని, వైద్యం కోసం వచ్చే వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మధు, ఇతర సిబ్బంది, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేసి గృహప్రవేశానికి సిద్ధం చేయాలి
కలెక్టర్ దివాకర టీఎస్


