ములుగు: పదో తరగతి పరీక్షలు నేటి నుంచి (శనివారం) ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30గంటల నుంచి 12:30 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 117 పాఠశాలకు చెందిన 3,291 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లా వ్యాప్తంగా 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రతీ పరీక్ష కేంద్రానికి సీఎస్ (చీఫ్ సూపరింటెండెంట్), డీఓను(డిపార్ట్మెంటల్ ఆఫీసర్)ను కేటాయించారు. 203 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారు. జిల్లాలో మూడు సీ–సెంటర్లు ఉండడంతో వాటికి ప్రత్యేకంగా సీ–సెంటర్ కస్టోడియన్లను ఏర్పాటు చేశారు. ఈసారి సెంట్రల్ సిలబస్ తరహాలో విద్యాశాఖ పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తుంది. ప్రతీ పరీక్షకు మూడు నుంచి నాలుగు రోజులపాటు వ్యవధి ఉండడంతో ప్రతి విద్యార్థి మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. పరీక్ష ప్రారంభం నుంచి ముగిసేవరకు పరీక్ష కేంద్రాల పరిధిలోని జిరాక్స్ సెంటర్లను మూసి వేసేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల సందర్భంగా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులు హాల్టికెట్, పెన్నులు, పరీక్ష ప్యాడ్ తప్ప ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దని అధికారులు చెబుతున్నారు. పరీక్ష కేంద్రానికి గంటముందుగానే విద్యార్థులు చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద తాగునీరు, వైద్య సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్టికెట్ తీసుకుని రావాలని, ఒకవేళ హాల్టికెట్ పోయినట్లయితే ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్ను అంగీకరిస్తామని పేర్కొన్నారు.
పదో తరగతి వార్షిక పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. 3,291 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్ అనుమతి లేదు. ఇన్విజిలేటర్లు, ఇతర అధికారులు క్లాక్ రూమ్ వద్ద తమ సెల్ఫోన్లను డిపాజిట్ చేయాలి. మాస్ కాపీయింగ్ జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించాం. విధుల్లో పాల్గొనే సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలి.
– సిద్ధార్థరెడ్డి,
జిల్లా విద్యాశాఖ అధికారి
●
జిల్లాలో 20 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు
విధుల్లో 203 మంది ఇన్విజిలేటర్లు
పరీక్షలు రాయనున్న
3,291 మంది విద్యార్థులు


