మహా జాతరనూ వదల్లేదు!
మేడారంలో మహారాష్ట్ర, నంద్యాల దొంగలు
సాక్షిప్రతినిధి, వరంగల్: మేడారం మహాజాతరను కూడా దొంగల ముఠాలు వదల్లేదు. ప్రధానంగా జంపన్న వాగు, గద్దెల పరిసరాల్లో భక్తుల మొబైల్ ఫోన్లు, బంగారు గొలుసులు, నగదును దొంగిలించిన ఘటనల్లో కీలక వ్యక్తుల సమాచారం లభ్యమైంది. ‘వ్యాల్యూ పిచ్’ సాఫ్ట్వేర్ ఆధారంగా ఫేస్ రికగ్నేజేషన్ సిస్టంతో ఈ దొంగతనాలకు సంబంధించి కొందరు నిందితులను, దొంగిలించిన వస్తువులను కొనుగోలు చేసేవారిని పోలీసులు అరెస్టు చేశారు. జాతరలో ఫేస్ రికగ్నేజేషన్ ద్వారా గతంలో దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలను గుర్తించినట్లు క్రైం ఇన్వెస్టిగేషన్ విభాగం ప్రకటించింది.
సాంకేతిక సహకారంతో దొంగల ఆటకట్టు..
భక్తుల పర్యవేక్షణ, వారి కదలికలు, వాహనాల రాకపోకలను నిశితంగా గమనించేందుకు జాతరలో ఏఐ కెమెరాలు పెట్టారు. ఆటోమెటిక్ నంబర్ పేస్ రికగ్నేషన్ కెమెరాలను (ఏఎన్పీఆర్) 10 చోట్ల అమర్చారు. దొంగతనాలకు పాల్పడే పాతనేరస్తులను గుర్తించేందుకు ఆటోమెటిక్ ఫేస్ రికగ్నేషన్ కోసం ప్రత్యేక సీసీ కెమెరాలను రద్దీ ప్రాంతాల్లో పెట్టారు. గతంలో చోరీలు చేసిన ఇతర రాష్ట్రాల దొంగల ఫొటోలు కంప్యూటర్లో ఫీడ్ చేశారు. వ్యాల్యూ పిచ్ అనే సాఫ్ట్వేర్తో అనుసంధానం చేయగా కంప్యూటర్లో ఫీడ్ చేసిన ఫొటోల్లోని వ్యక్తులు ఎవరొచ్చినా పోలీసులకు అలర్ట్ ఇస్తుంది. ఇదంతా గద్దెల పక్కనే ఉన్న కమాండ్ కంట్రోల్ రూంలో అమర్చిన పెద్ద ఎల్సీడీ స్క్రీన్లను 24/7 నిరంతర పర్యవేక్షణ చేసేలా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల జాతరకు పాత దొంగలు వచ్చినట్లు 70 అలర్ట్లు వచ్చాయి. డ్రోన్, సీసీ కెమెరాలు ఆ దొంగలను గుర్తించాయి. కమాండ్ కంట్రోల్ రూంకు వారి ముఖాలను పంపడంతో అప్రమత్తమైన పోలీసులు.. మహారాష్ట్ర, ఏపీలోని నంద్యాల గ్యాంగ్లకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
ట్రేస్ చేసిన వ్యాల్యూ పిచ్ సాఫ్ట్వేర్
‘ఫేస్ రికగ్నేజేషన్ సిస్టం’తో
దొరికిన ఆచూకీ
70 మంది గుర్తింపు,
ఐదుగురి అరెస్టు.. విచారణ


