
హేమాచల క్షేత్రంలో భక్తుల కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం శనివారం భక్తుల సందడితో కోలాహలంగా మారింది. ఆలయంలో స్వయంభుగా వెలిసిన లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆయా ప్రాంతాల నుంచి కార్లు, ఆటోలు, ప్రైవేటు బస్సులు తదితర ప్రైవేట్ వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు.
స్వామివారికి ప్రత్యేక పూజలు
అనంతరం హేమాచలకొండపై ఉన్న ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు కారంపుడి పవన్కుమార్ ఆచార్యులు స్వామివారికి ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నువ్వుల నూనెతో తిల తైలాభిషేకం, ప్రత్యేక అర్చనలు జరిపించారు. బక్తులు స్వామివారికి సమర్పించిన నూతన పట్టు వస్త్రాలు, వివిధ రకాల పూల దండలను అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొని మానవ శరీరంతో పోలిఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. అనంతరం అర్చకులు ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు.
చింతామణి జలపాతం వద్ద
పుణ్యస్నానాలు
స్వామివారి నిజరూప దర్శనంతో
పులకించిన భక్తజనం

హేమాచల క్షేత్రంలో భక్తుల కోలాహలం