ట‌ర్కీ ప్రథమ మ‌హిళ‌తో ఆమిర్.. నెటిజన్ల ఫైర్‌ | Sakshi
Sakshi News home page

ట‌ర్కీ ప్రథమ మ‌హిళ‌తో ఆమిర్ ఖాన్.. నెటిజన్ల ఫైర్‌

Published Mon, Aug 17 2020 2:06 PM

Viral Pics: Aamir Khan Meets With Turkish First Lady Emine Erdogan - Sakshi

కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ విధించ‌డంతో మూడు నెల‌ల క్రితం షూటింగ్‌లు ఆగిపోయిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు లాక్‌డౌన్ ఎత్తివేయ‌డంతో భారత్‌లో షూటింగ్‌లు చేసుకోవ‌డానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని నియ‌మ నిబంధ‌న‌ల‌తో అనుమతి ఇచ్చింది. దీంతో కొన్ని సినిమాలు షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాయి. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో ఆమిర్‌ ఖాన్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం లాల్ సింగ్ చద్దా షూటింగ్ కోసం టర్కీకి వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ దిగగానే ఆమిర్‌ను చూసేందుకు ఆయన అభిమానులు ఆసక్తి చూపారు. ఆమిర్‌తో కలిసి సెల్ఫీలు దిగారు. (‘టర్కిలో అతిపెద్ద సూపర్ స్టార్’)

తాజాగా టర్కీ ప్రథమ మహిళ ఎమిన్ ఎర్డోగాన్‌ను ఇస్తాంబుల్‌లోని హుబెర్ మాన్షన్‌లో ఈ మిసర్ట్‌ పర్‌ఫెక్ట్‌ శనివారం కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఎమిన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఈ పోస్టులో ఎమిన్‌ ‘ప్రపంచ ప్రఖ్యాత భారతీయ నటుడు, చిత్రనిర్మాత, దర్శకుడు ఆమిర్‌ ఖాన్‌ను ఇస్తాంబుల్‌లో కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆమిర్‌ తన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్‌ను టర్కీలోని వివిధ ప్రాంతాల్లో చిత్రించాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. ఇందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను.’అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. (లాల్‌సింగ్‌ వాయిదా పడ్డాడు)

అయితే ఆమిర్‌, టర్కీ ప్రథమ మహిళనను కలవడంపై కొంతమంది నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కశ్మీర్ విషయంలో టర్కీ అధ్యక్షుడు పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ.. భారతదేశంలో స్టార్‌ నటుడిగా పేరుగాంచిన ఆమిర్ ఇలా చేసి ఉండకూడదంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా కరీనా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. టామ్‌హాంక్స్‌ కథానాయకుడిగా 1994 వచ్చిన హాలీవుడ్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌' చిత్రానికి రీమేక్‌గా ‘లాల్‌సింగ్‌ చద్దా’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లాల్ సింగ్ చద్దా సినిమా 2021 క్రిస్మస్‌ కానుకగా విడుదల కానుంది.

Advertisement
Advertisement