హీరో ప్రభాస్, ‘హను–మాన్ ’ ఫేమ్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కేందుకు సన్నాహాలు జరుగుతున్నాయనే వార్త ప్రచారంలో ఉంది. ఈ ఏడాదే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లొచ్చు అనే ఊహాగానాలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ప్రశాంత్ వర్మ తర్వాతి సినిమా ‘జై హనుమాన్ ’ (హను–మాన్ ’ సినిమాకు సీక్వెల్) ప్రారంభోత్సవం ఈ వారంలో హంపీలో జరగనున్నట్లుగా తెలిసింది. రిషబ్ శెట్టి హీరోగా నటించనున్న ఈ సినిమాను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్నారు.
‘జై హనుమాన్ ’ సినిమా చిత్రీకరణతో ప్రశాంత్ వర్మ బిజీ కానున్న నేపథ్యంలో ప్రభాస్తో ఆయన చేయాల్సిన సినిమా ఇక ఉండదనే ప్రచారం ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపించింది. అయితే ఈ విషయంపై స్పష్టత వచ్చింది. ‘‘ప్రభాస్తో ప్రశాంత్వర్మ చేయాల్సిన సినిమాపై ప్రస్తుతం ప్రచారంలోకి వచ్చిన వార్తలు వాస్తవాలు కాదు. ఈ పుకార్లను నమ్మవద్దు. ప్రభాస్ ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు పూర్తయిన తర్వాత మా సినిమా ఉంటుంది. ఈ చిత్రం స్థాయి, విజన్ చాలా పెద్దవి. ప్రిపరేషన్ , ఎగ్జిక్యూషన్ కు కొంత సమయం పడుతుంది. ఈ అంశాలపై సరైన సమయంలో అధికారికంగా వెల్లడిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది.


