సుహాస్, శివానీ నాగారం హీరో హీరోయిన్లుగా, వీకే నరేష్ కీలక పాత్రలో నటించిన సినిమా ‘హే బల్వంత్’. గోపీ అచ్చర దర్శకత్వంలో బి. నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు (శుక్రవారం) విడుదలవుతోంది. నిర్మాతలు–పంపిణీదారులు వంశీ నందిపాటి, బన్నీ వాసు రిలీజ్ చేస్తున్నారు. గురువారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో సుహాస్ మాట్లాడుతూ–‘‘ఓ కామన్ మేన్ గా నేనిక్కడి వరకు వచ్చాను.
ప్రేక్షకులు పెట్టే ప్రతి రూపాయికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో కాస్త గ్యాప్ తీసుకుని, ‘హే బల్వంత్’ సినిమా చేశాను. ఈ సినిమా నా కెరీర్లో బిగ్గెస్ట్ రిలీజ్. బిగ్గెస్ట్ సక్సెస్ కూడా అని అనుకోవచ్చు. సుహాస్ ‘2.ఓ’గా ఈ మూవీ ప్రేక్షకులందరినీ అలరిస్తుంది. ఆడియన్స్ కు నేనిస్తున్న గ్యారెంటీ ఇది’’ అన్నారు.
‘‘కొత్తదనంతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘హే బల్వంత్’ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. యాక్టర్గా సుహాస్ నెక్ట్స్ ఫేజ్లోకి వెళ్తున్నాడు’’ అన్నారు వీకే నరేష్. ‘‘650కి పైగా స్క్రీన్స్లో మా సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. ఇది మా కాన్ఫిడెన్స్ కి నిదర్శనం. పెయిడ్ ప్రీమియర్లు కూడా స్టార్ట్ చేశాం. మేం కచ్చితంగా హిట్ కొట్టబోతున్నాం’’ అన్నారు వంశీ నందిపాటి.


