సెలబ్రిటీలకు ప్రత్యేకమైన ఫ్యాన్బేస్ ఉంటుంది. ఎవరి హీరో/ హీరోయిన్ వారికి గొప్ప! అయినా మా అభిమాన తారయే గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో రకరకాల పోస్టులు, ఫోటోలు, వీడియోలు పెడుతూ ఉంటారు. అలా ఏఐ (కృత్రిమ మేధ) సాయంతో సృష్టించిన ఫోటో ఒకటి బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కంటపడింది.
ఆ హీరోయిన్ల కాళ్లకు నమస్కరిస్తూ..
అందులో ఐశ్వర్యరాయ్ను గ్లోబల్ బ్యూటీగా పేర్కొనగా ఆ తర్వాతి కేటగిరీలో దీపిక పదుకొణె, ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్ ఉన్నారు. చివరగా ఆలియా భట్, కరీనా కపూర్, కత్రినా కైఫ్, ఊర్వశి రౌతేలా ఉన్నారు. చిట్టచివరి కేటగిరీలో ఉన్న వీళ్లందరూ తమపై ఉన్న హీరోయిన్ల ముందు మోకరిల్లి వారి పాదాలు నమస్కరిస్తున్నట్లుగా ఫోటో సృష్టించారు. ఈ ఫోటోపై ఊర్వశి సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
విషం చిమ్మడం ఆపండి
'ప్రతి నటికి తనకంటూ సొంత జర్నీ ఉంటుంది. ఆ జర్నీలో ఎంతో కష్టపడుతుంది. అలాంటి మహిళల్ని పోలుస్తూ ఫ్యాన్ వార్ సృష్టించడం వల్ల ఒరిగేదేం ఉండదు. అది కేవలం నెగెటివిటీని మాత్రమే వ్యాపింపజేస్తుంది. దానికి బదులుగా టాలెంట్ను గుర్తించండి, ఎదుగుదలను ప్రోత్సహించండి, దయతో ప్రవర్తించడం నేర్చుకోండి. ఇలా విషం చిమ్మడం ఆపేయండి' అని ఊర్వశి కోరింది. ఇది చూసిన అభిమానులు.. నటీనటులకు ఇలా ర్యాంకింగ్ ఇస్తూ ఒకర్ని తక్కువ, మరొకర్ని ఎక్కువ చూడం కరెక్ట్ కాదని హితవు పలుకుతున్నారు.
ఐటం సాంగ్స్తో పాపులర్
ఎవరి ప్రతిభ వారిదేనని, ఇలా పోల్చడం మంచిది కాదని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఊర్వశి రౌతేలా.. నటిగా కన్నా ఐటం సాంగ్స్తోనే ఎక్కువ ఫేమస్ అయింది. ఈమె తెలుగులో 'వాల్తేరు వీరయ్య' మూవీలో 'బాసూ.. వేర్ ఈజ్ ద పార్టీ', ఏజెంట్లో 'వైల్డ్ సాలా', 'బ్రో'లో 'మై డియర్ మార్కండేయ', 'స్కంద'లో 'కల్ట్ మామా' సాంగ్స్లో హుషారుగా స్టెప్పులేసింది. చివరగా జాట్ మూవీలోనూ 'టచ్ కియా' పాటలో అదరగొట్టింది.

చదవండి: పాతిక వేల సాయం.. దాని విలువ ఇప్పుడు రూ.5 కోట్లు: దర్శకుడు


