
జన్మనిచ్చిన అమ్మా, నాన్నల తర్వాత మన జీవితంలో అంతటి ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి ఆయన ఒక్కరే. తల్లిదండ్రులు మనల్ని పెంచి పోషిస్తే.. మనకు జీవిత పాఠాలు నేర్పేది మాత్రం గురువులే. అది ఏ రంగమైనా సరే గురువు లేకుండా మనం సక్సెస్ అవ్వడం చాలా అరుదు. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గురువుల సాయంతో స్టార్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు గురు పూజోత్సవం సందర్భంగా మన తెలుగు సినీ దర్శక గురువుల గురించి తెలుసుకుందాం.
తన డైరెక్షన్తో ఓ మార్క్ వేశారు క్రియేట్ చేశారు సుకుమార్. 'ఆర్య' చిత్రం కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన ఈ స్టార్ డైరెక్టర్.. తన తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. తన మాస్టర్ స్క్రీన్ ప్లేతో సరికొత్త కథలను తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో రాణించారు. 'పుష్ప: ది రైజ్ ' తో పాన్ ఇండియా స్థాయిలో రికార్డ్ క్రియేట్ చేశారు. అల్లు అర్జున్కు నేషనల్ అవార్డు దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే సుకుమార్ శిష్యులు కూడా తమ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ ద్వారా వారిని సపోర్ట్ చేస్తూ అండగా నిలిచారు. ఆయన స్కూల్ నుంచి వచ్చినవారందరూ ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా స్థిరపడుతున్నారు.
స్టార్ డైరెక్టర్లుగా సుకుమార్ శిష్యులు
'ఉప్పెన' సినిమాతో డైరెక్టర్గా పరిచయమైన బుచ్చిబాబు సనా.. మెగా మేనల్లుడితో కలసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్తో పాటు జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు. సుకుమార్కు ఆయన ప్రియ శిష్యుడు. ఈ క్రమంలోనే తన సొంత బ్యానర్లో డైరెక్టర్గా లాంఛ్ చేశారు. ప్రస్తుతం మెగా హీరో రామ్ చరమ్తో పెద్ది అనే పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు.
టాలీవుడ్లో మరో సంచలన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఈయన కూడా సుకుమార్ శిష్యుడే. 'నాన్నకు ప్రేమతో', 'రంగస్థలం' వంటి చిత్రాలకు పనిచేసిన శ్రీకాంత్.. 'దసరా' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. నాని, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల స్టార్ హోదాను సొంతం చేసుకున్నారు.
'కరెంట్' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన పల్నాటి సూర్య ప్రతాప్ కూడా సుకుమార్ దగ్గర శిష్యరికం చేసినవాడే. ఫస్ట్ సినిమా నిరాశ పరిచినా, గురువు నేతృత్వంలో రెండో సినిమా 'కుమారి 21F'తో మంచి సక్సెస్ అందుకున్నాడు. జక్కా హరి ప్రసాద్ ఎన్నో సినిమాలకు సుక్కుతో కలసి వర్క్ చేశాడు. 100% లవ్ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చిన హరి.. '1 నేనొక్కడినే' సినిమాకు రచయితగా చేశాడు. 'ప్లే బ్యాక్' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
యాంకర్ ప్రదీప్ హీరోగా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమా తీసిన దర్శకుడు మున్నా కూడా సుకుమార్ శిష్యుడే. డైరెక్టర్ 'బొమ్మరిల్లు' భాస్కర్ కూడా 'ఆర్య' సినిమాకు సుకుమార్ దగ్గర అసిస్టెంటట్గా పనిచేశాడు. 'భమ్ భోలేనాథ్' ఫేమ్ కార్తీక్ దండు కూడా ఆయన దగ్గర శిష్యరికం చేసినవాడే. సుకుమార్ బ్యానర్లో సాయి ధరమ్ తేజ్ హీరోగా 'విరూపాక్ష' అనే సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో స్టార్ రైటర్గా రాణిస్తోన్న శ్రీకాంత్ విస్సా కూడా సుకుమార్ దగ్గర వర్క్ చేశాడు. పుష్ప, పుష్ప 2, 18 పేజీస్ వంటి సినిమాల స్క్రిప్టు విషయంలో సుకుమార్కు సపోర్ట్గా నిలిచాడు. డెవిల్, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు కూడా ఆయన రైటర్గా పనిచేస్తున్నారు.
ఆర్జీవీ తీర్చిదిద్దిన దర్శకులు..
అప్పట్లో ఇండియన్ సినిమాను ఓ రేంజ్కు తీసుకెళ్లిన ఘనత రామ్ గోపాల్ వర్మదే. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందరో డైరెక్టర్లు బయటకు వచ్చి వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్డమ్ను తెచ్చుకున్నారు. వర్మ శిష్యుల్లో గొప్పగా తెచ్చుకున్న వాళ్లలో కృష్ణవంశీ, తేజ, పూరి జగన్నాథ్, గుణశేఖర్, శివనాగేశ్వరరావు, నివాస్, అజయ్ భూపతి, జీవన్ రెడ్డి, హరీశ్ శంకర్, జేడీ చక్రవర్తి, బాలీవుడ్ నుంచి అనురాగ్ కశ్యప్, బాలీవుడ్ అగ్రదర్శకుడు మధుర్ బండార్కర్ ఉన్నారు. వర్మ ఫిలిం ఫ్యాక్టరీ పేరుతో ఆర్జీవీ బోలెడంతమందిని తన శిష్యులుగా తయారు చేసి వారికి లైఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
చిరంజీవి- విశ్వనాథ్- కమల్ హాసన్ గురు శిష్యుల బంధం..
తెలుగు సినిమా స్థాయిని శిఖరాగ్రానికి చేర్చి.. తన ప్రతి సినిమాతో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న దర్శకులు విశ్వనాథ్కు మెగాస్టార్ చిరంజీవికి మధ్య గురు శిష్యుల సంబంధం ఉన్న విషయం అందరికి తెలిసిందే. విశ్వనాథ్ దర్శకత్వంలో చిరు నటించిన శుభలేఖ, ఆపద్భాంధవుడు, రుద్రవీణ, స్వయంకృషి, వంటి సినిమాలు మెగాస్టార్ కెరియర్లో మైలురాయిగా సుస్థిరస్థానం సంపాదించుకున్నాయి. మెగాస్టార్ మాస్ హీరోగా మాత్రమే కాదు, ఫ్యామిలీ అండ్ క్లాసికల్ సినిమాలలో సైతం అద్భుతంగా నటించి ఏ సినిమాకు అయినా వన్నె తేగలరు అని నిరూపించాయి వారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు. ఇప్పటికీ కూడా ఒక క్లాసిక్గా నిలుస్తాయనడంలో సందేహం ఉండదు. అలాగే కె.విశ్వనాథ్ - ప్రముఖ కథానాయకుడు కమల్హాసన్ మధ్య గురు శిష్యుల బంధం ఉంది. ఈ ఇద్దరి కలయికలో ఎప్పటికీ గుర్తుండిపోయే సాగర సంగమం, శుభ సంకల్పం చిత్రాలొచ్చాయి. కె.విశ్వనాథ్ జీవించి ఉన్న రోజుల్లో ఆయనతో కొంత సమయం గడిపేవారు కమల్హాసన్.. మరో దిగ్గజ దర్శకుడు కె బాల చందర్ కూడా కమల్కు గురువే.. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి.