
సాక్షి, హైదరాబాద్: కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల అడవిని మాయం చేసి పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు కల్పిస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం.. ఆ భూములు మావంటూ వాటిని కాపాడుకోవడానికి పోరుబాట పట్టారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు (#HCU Protest). వందలాది జేసీబీలు అర్ధరాత్రి అడవిని ధ్వంసం చేయడానికి వెళ్తే నెమళ్ల ఆర్తనాదాలు, భయంతో పరుగులు తీస్తున్న దుప్పిల వీడియోలు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తున్నాయి.
అడవిని కాపాడుకుందాం
అవి చూసిన సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాలుష్యంతో నిండిపోతున్న నగరానికి ఆక్సిజన్ అందిస్తున్న భూముల్ని అమ్మడం అన్యాయమని మండిపడుతున్నారు. అడవి నరికివేత ఆపేయాలని, పర్యావరణాన్ని కాపాడుకుందాం అని నినదిస్తున్నారు. హీరో రామ్చరణ్ సతీమణి ఉపాసన (Upasana Konidela) ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీరు ఇదే గనక చేయాలనుకుంటే అక్కడున్న మూగజీవాలు, పక్షులకు ఎక్కడ పునరావాసం కల్పిస్తారు? నరికివేసిన చెట్లను తిరిగి ఎక్కడ పెంచుతారు? వీటన్నింటికీ సమాధానం చెప్పండి అని కోరింది.

దయచేసి వేడుకుంటున్నా..
పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ (Renu Desai) స్పందిస్తూ.. రెండు రోజుల క్రితమే నాకు విషయం తెలిసింది. అన్ని విషయాలు కనుక్కున్నాకే వీడియో చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డిగారూ.. ఒక తల్లిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా.. నాకు 44 ఏళ్లు. రేపోమాపో ఎలాగైనా పోతాను. కానీ పిల్లలు.. మన రేపటితరానికి ఆక్సిజన్, నీళ్లు అవసరం.
వదిలేయండి..
అభివృద్ధి అవసరం.. కాదనను. ఐటీ పార్కులు, బహుళ అంతస్తుల భవనాలు.. అన్నీ అవసరమే! కానీ ఈ 400 ఎకరాలను మాత్రం వదిలేయండి. నిర్మానుష్యంగా ఉన్న భూముల్ని వెతకండి. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఏదో ఒకటి చేయండి. మీరు చాలా సీనియర్. ఒక తల్లిగా అడుక్కుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి అని వీడియో రిలీజ్ చేసింది. మూగజీవాల్ని అడవి నుంచి తరిమేయకండి అంటూ యాంకర్ రష్మీ గౌతమ్ సైతం వీడియో షేర్ చేసింది.
చదవండి: లాల్ సింగ్ చద్దా.. ఆ స్టార్ హీరోకంటే అతడి కొడుకే బెటర్: దర్శకుడు