ప్రస్తుతం టాలీవుడ్లో పర్సంటేజీ పంచాయితీ నడుస్తోంది. నిర్మాతలు.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాలు ప్రదర్శించినందుకు అద్దె మాత్రమే చెల్లిస్తామని అంటుంటే.. ఎగ్జిబిటర్లు మాత్రం మల్టీప్లెక్స్లకు ఇస్తున్నట్లు తమకు కూడా పర్సంటేజీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రామ్ చరణ్ 'పెద్ది'తోనే దీనిని మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ నిర్మాతల వైపు నుంచి సానుకూల స్పందన రావట్లేదు. దీంతో ఇది కాస్త ఇప్పుడు చిరంజీవి దగ్గర చేరింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)
తెలంగాణ ఎగ్జిబిటర్లతో సోమవారం సాయంత్రం 4 గంటలకు చిరంజీవి భేటీ కానున్నారు. ఇందులో పర్సంటేజీ విధానంపై చర్చించుకోనున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో వేసిన కమిటీ ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి జూన్ నెలాఖరు వరకు గడువు కోరగా.. ఎగ్జిబిటర్స్ మాత్రం దీనిపై అసంతృప్తి గా ఉన్నారు. ససేమిరా అంటున్నారు. మల్టీప్లెక్స్ల కంటే తక్కువగా ఎంతో కొంత పర్సంటేజీని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
శనివారం జరిగిన ఎగ్జిబిటర్స్ సమావేశంలోనే చిరంజీవి సమయం ఇస్తే తాము గోడు వినిపిస్తాం అని ఎగ్జిబిటర్లు అన్నారు. ఇప్పుడు చిరుతో భేటీకి సిద్ధమయ్యారు. పెద్ది సినిమాని తాము టార్గెట్ చేయలేదని, ఏడాదిగా పర్సంటేజీ గురించి అడుగుతున్నామని ఎగ్జిబిటర్స్ అంటున్నారు. మరోవైపు నిర్మాతలు మాత్రం.. నిర్మాణంలో ఉన్న 25సినిమాలపై ఇప్పటికే దాదాపు 70-80 శాతం ఖర్చు చేశామని, అవి రిలీజైన తర్వాత పర్సంటేజీ ఇస్తామని అంటున్నారు. ఇప్పటికే ఎగ్జిబిటర్స్ ఆందోళనల గురించి 'పెద్ది' నిర్మాత వెంకట్ సతీష్ కిలారు.. రామ్ చరణ్కి తెలియజేశారు. మరి ఎగ్జిబిటర్స్ వర్సెస్ నిర్మాతల పర్సంటేజీ వివాదాన్ని ఇప్పుడు చిరంజీవి పరిష్కారిస్తారా? ఒకవేళ చేస్తే ఏం చేస్తారనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: తెలుగు ఆడియెన్స్ కోసం మరో ఓటీటీ)


