దైవం అన్నది మానవ జీవితంలో అతి ప్రధానమైనది. నాస్తికులు దీన్ని అంగీకరించకపోవచ్చు. ఆ విషయాన్ని పక్కన పెడితే ఏదో ఒక తరుణంలో మనిషి నిజమైన భక్తిని పొంది పరవశిస్తాడు. అలాంటి నిజమైన భక్తి పారవశ్యాన్ని పొంది తరించానంటున్నారు నటి శృతి హాసన్. నాస్తికుడైన కమలహాసన్ వారుసురాలిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్(Shruti Haasan) మాత్రం ఆస్తికురాలే. దైవభక్తి కలిగిన నటి. వ్యక్తిగతంగా సంచలన నటి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తమిళ్, తెలుగులో పలు హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఆమె రాణిస్తున్నారు. ఆ మధ్య ప్రేమలో పడ్డా, ఆ వ్యవహారం అచ్చిరాలేదనే చెప్పాలి. దీంతో ప్రస్తుతం తాను సింగిల్ అని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చిన గట్స్ కలిగిన నటి శృతీహాసన్. ఇటీవల ఈమె నిజమైన భక్తి భావనను పొందిన విషయంపై ఒక భేటీలో పేర్కొన్నారు. ‘ఇటీవల నేను వారాహీ మాత ఆలయానికి వెళ్లాను. మనమే కాదు. దైవాలు కూడా మనల్ని ఎంచుకుంటారు. ఒక మిత్రుడు నువ్వు చాలా ప్రత్యేకంగా ఉన్నావు. రా దేవాలయానికి వెళ్లి వద్దాం అని పిలిచారు. అది చాలా చిన్న ఆలయమే. అయితే గర్భగుడిలోకి వెళ్లగానే నిజమైన భక్తి పారవశ్యాన్ని పొందాను. ఎలాంటి ఆడంబరం లేదు. వీఐపీల క్యూ లేదు. శక్తివంతమైన దేవత ’ అని నటి శృతి హాసన్ పేర్కొ న్నారు. అయితే, అమ్మవారి దర్శనం తర్వాత తన జీవితంలో చాలా మంచి మార్పులు వచ్చాయని, తనలో కొత్త శక్తి వచ్చిందని ఆమె చెప్పడం విశేషం.

శృతి హాసన్ జీవితంలో మార్పులు
శృతి హాసన్ చెన్నైలో సందర్శించిన ప్రసిద్ధ వారాహి దేవి ఆలయం మయిలాపూర్ (Mylapore)లో ఉంది. ఈ ఆలయం చెన్నైలోని ప్రసిద్ధ కపాలీశ్వర ఆలయానికి సమీపంలో ఉంది, ఇది వారాహి ఆరాధనకు అత్యంత శక్తివంతమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయ దర్శనం కొద్దిరోజుల తర్వాత శృతి హాసన్ అస్సాంలోని వారాహి మాత (కామాఖ్య దేవాలయం) కూడా దర్శించారు. ఇది అస్సాంలోని గువాహటిలో నీలాచల్ కొండలపై ఉంది. వారాహి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తన జీవితంలో మంచి మార్పులు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. ఇది ఒక ప్రముఖ శక్తి పీఠం ఆపై తంత్ర సాధనకు అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రదేశం.
ఇకపోతే ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతికి జంటగా ట్రైన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది నిర్మాణ దశలో ఉంది. సలార్–2 చిత్రంలో నటించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగులో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది.


