మరో నాలుగు రోజుల్లో పెద్ది ప్రేక్షకుల ముందుకు రానుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మూవీ ప్రమోషన్స్లో చిత్రబృందం చెబుతున్న విషయాలతో ఆ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. చరణ్కు అవార్డుకు రావడం పక్కా అంటున్నారు. అలాగే క్లైమాక్స్ కన్నీళ్లును పెట్టిస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ‘పెద్ది’ తనకు చాలా స్పెషల్ చిత్రం అంటున్నాడు. కథ వినగానే నటించేందుకు ఓకే చెప్పేశాడట. కానీ మధ్యలో మళ్లీ ఈ సినిమా వదిలేద్దాం అనుకున్నాడట ఈ స్టార్ హీరో. తనకు బదులుగా వేరే వ్యక్తిని తీసుకోమని చెబితే.. బుచ్చిబాబు వినలేదని.. తాను వచ్చేవరకు షూటింగ్ చేయకుండా ఆపేశాడని చెప్పాడు శివరాజ్ కుమార్.
నటించలేనని చెప్పా..
శివరాజ్ కుమార్ 2024లో క్యాన్స్ర్ బారిన పడిన సంగతి తెలిసిందే. చికిత్స కోసం కొన్నాళ్ల పాటు అమెరికా వెళ్లి వచ్చాడు. అయితే క్యాన్సర్ బారిన పడేకంటే ముందే శివరాజ్ కుమార్ పెద్ది సినిమా ఒప్పుకున్నాడట. తనకు వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడట. కానీ బుచ్చిబాబు అందుకు ఒప్పుకోలేదని..తాను వచ్చేవరకు ఎదురు చూశారని శివరాజ్ కుమార్ చెప్పాడు. తాజాగా చెన్నైలో నిర్వహించి పెద్ది ఈవెంట్లో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘, బుచ్చి బాబు నాకు కథ చెప్పినప్పుడు నాకు ఆ సబ్జెక్ట్ నచ్చింది. ఆ రోజు నేను రామ్ చరణ్తో కూడా మాట్లాడాను. ఆ తర్వాత, దురదృష్టవశాత్తు, నాకు క్యాన్సర్ అని నిర్ధారణ అయింది, నేను అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అందుకే ఈ సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నా.
నా కోసం ఎదురు చూశారు..
నా నిర్ణయాన్ని చిత్రబృందానికి తెలియజేశా. గౌర్నాయుడు(పెద్దిలో శివరాజ్కుమార్ పోషించిన పాత్ర) పాత్రకి వేరే నటుడిని తీసుకోమని వారికి చెప్పా. కానీ నిర్మాతలు, దర్శకుడు నన్ను వెళ్లనివ్వలేదు. బుచ్చిబాబు వచ్చి ‘మాకు మీరే కావాలి సార్’ అన్నాడు. నా కోసం చాలా కాలం ఎదురు చూశారు. వారికి కృతజ్ఞతలు. పెద్ది నాకు స్పెషల్ మూవీ’ అని శివరాజ్ కుమార్ అన్నాడు.


