మహా సముద్రం మూవీకి పారితోషికం తగ్గించిన శర్వానంద్‌!

Sharwanand Decreases Remuneration For Mahasamudram Movie - Sakshi

క‌రోనావైర‌స్ దెబ్బ‌కు సినిమా ఇండ‌స్ట్రీ దారుణంగా న‌ష్ట‌పోయింది. షూటింగ్‌లు వాయిదా పడి అనుకున్న సమయానికి రాకపోవడం, థీయేటర్లు మూత పడటంతో నటులకంటే నిర్మాతలు, థీయేటర్ల నిర్వహకులే ఎక్కువగా నష్టపోయారు. దీంతో వారిపై ఊహించని రీతిలో ఆర్థిక భారం పెరిగిపోయింది. ఈ క్రమంలో ముందుగా అనుకున్న బడ్జేట్‌తో సినిమాలు తీయడం, నటీనటులకు రెమ్యూనరేషన్‌ ఇవ్వడమంటే నిర్మాత‌ల‌కు త‌ల‌కు మించిన భార‌మే అవుతుంది. అందుకే కొంతమంది దర్శకులు, హీరోలు స్వచ్చందంగా త‌మ పారితోషికంలో కోత విధించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో యంగ్‌ హీరో శ‌ర్వానంద్ సైతం మహా సముంద్రం మూవీకి తన పారితోషికాన్ని త‌గ్గించుకున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆర్‌ఎక్స్‌ 100 దర్శకుడు అజయ్‌ భూపతి తెరకెక్కిస్తున్న మహా సముద్రంలో శర్వా హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మల్టిస్టారర్‌ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో శర్వానంద్‌తో పాటు హీరో సిద్దార్థ్‌ కూడా నటిస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ మూవీకి సిద్ధార్థ్ 3 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు ఇప్పటికే వార్తలు రాగా.. శర్వానంద్ దాదాపు 5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

అయితే లాక్‌డౌన్ ముందు ఒక్క సినిమాకు శర్వానంద్‌ 6 నుంచి 7 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ అందుకున్నాడు. మహమ్మారి కారణంగా ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులు, మేకర్స్‌ కష్టాలను దృష్టిలో పెట్టుకుని శర్వా తన పారితోషికంలో దాదాపు కోటి రూపాయలకు పైగా కోత పెట్టుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా విడుదలైన తర్వాత మిగిలిన లావాదేవీలు చూసుకోవచ్చని నిర్మాతతో ఒప్పందం కుదుర్చుకున్నాడట. కాగా ఈ సినిమాలో హీరోయిన్లుగా అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేలు నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి ఈ సినిమా విడుదల కానుంది.

చదవండి: 
ఉదయ్‌ కిరణ్‌ ఆగిపోయిన 10 సినిమాలు ఇవే!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top