Actress Sai Pallavi Controversial Comments On TV Dance Shows Goes Viral - Sakshi
Sakshi News home page

Sai Pallavi: వాటిపై నమ్మకం లేదు.. అలాంటివంటేనే అసహ్యం

Nov 5 2022 7:46 AM | Updated on Nov 5 2022 8:37 AM

Sai Pallavi controversial comments viral in social media - Sakshi

నటి సాయి పల్లవి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. దక్షిణాదిలో ముఖ్యంగా టాలీవుడ్‌లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న నటి సాయిపల్లవి. డాక్టర్‌ విద్యను చదివిన ఈమె నటిగా అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. ప్రేమమ్‌ అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైంది.

ప్రేమమ్‌ చిత్ర విజయంతో ఆమె పేరు దక్షిణాది చిత్ర పరిశ్రమంతా వ్యాపించింది. అలా ప్రస్తుతం దక్షిణాదిలో కథానాయకిగా ఉన్నత స్థాయికి చేరుకుంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ అమ్మడు మొదట్లో టీవీ ఛానల్‌లో డాన్స్‌ పోటీల్లో పాల్గొనడం ద్వారా సినీ అవకాశాలను దక్కించుకుంది. అయితే ఇప్పుడు ఈమె అలాంటి డాన్స్‌ పోటీలనే విమర్శిస్తోంది. అలాంటి పోటీల పైన తనకు నమ్మకం లేదని పేర్కొంది.

తమిళంలో విజయ్‌ టీవీల్లో ప్రసారం అయిన  ఉంగళిల్‌ యార్‌ అడుత్త ప్రభుదేవా (మీలో ఎవరు తదుపరి ప్రభుదేవా) అనే డాన్స్‌ పోటీల కార్యక్రమంలో పాల్గొన్న సాయి పల్లవి ఆ పోటీల్లో ద్వితీయ బహుమతికే పరిమితం అయ్యింది. అదే ఆమెను బాధ పెట్టినట్టుంది. ప్రథమ బహుమతి గెలుచుకోవడానికి కారణం ధన బలం అంటూ తన అక్కసును వెళ్లగక్కింది. దీని గురించి ఇటీవల ఆమె ఒక భేటీలో  పేర్కొంటూ డాన్స్‌ పోటీల్లో ప్రతిభకు ఎప్పుడు గౌరవం లేదని పేర్కొంది.

సాధారణంగా టీవీ ఛానళ్లలో డబ్బుకే అత్యంత ప్రాధాన్యత ఇస్తారని చెప్పింది. లేకపోతే ప్రముఖుల వారసులకు అలాంటి మర్యాద ఇస్తారని, అందుకే తనకు డాన్స్‌ పోటీలు అంటే నమ్మకం లేదని అలాంటివంటే అసహ్యం అంటూ ఆరోపణ చేసింది. కాగా ఈ నటి ఆ మధ్య ప్రభుదేవా నృత్య దర్శకత్వంలో ధనుష్‌తో కలిసి మారి –2 చిత్రంలో రౌడీ బేబీ అనే పాటలో నటించింది. ఆ పాటలో  ఆమె ధనుష్‌తో కలిసి చేసిన డాన్స్‌కు దేశ వ్యాప్తంగా పేరు వచ్చిందన్నది గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement