మాజీ మంత్రి ఆర్కే రోజా కూతురు అన్షు అరుదైన ఘనత సాధించారు. అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ ప్రతి ఏడాది ఒక్కరికి మాత్రమే ప్రతిష్టాత్మకంగా అందించే హెర్మన్ బి వెల్స్ (Herman B Wells) అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె ఇండియానా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ (Computer Science)లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. అన్షు శాస్త్రవేత్త (Scientist) కావాలనే లక్ష్యంతో చదువుపైనే దృష్టి పెట్టిందని రోజా చెప్పిన విషయం తెలిసిందే. చదువుతో పాటు ఆమె కోడింగ్, వెబ్ డెవలప్మెంట్, 'ఆర్ట్ ఫర్ ఎ కాజ్' ద్వారా సామాజిక సేవలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు.
ఇండియానా యూనివర్సిటీ అందించే అవార్డును అన్షు మాలిక అందుకోవడంతో ఆర్కే రోజా సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. 'డియర్ అన్షు నీ కఠోర శ్రమ, అంకితభావం, ధైర్యం నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాయి. ఇది ఆరంభం మాత్రమే. ఒక చిన్న కలగా మొదలైన ప్రయాణం ఇప్పుడు మాకు అపారమైన గర్వకారణంగా, ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.' అంటూ పేర్కొన్నారు.
1961 నుంచి ఇండియానా యూనివర్సిటీ ప్రతి సంవత్సరం ఒక అత్యుత్తమ విద్యార్థికి ప్రతిష్టాత్మకంగా ఈ పురస్కారం అందిస్తారు. విద్యలో టాపర్గా నిలవడంతో పాటు నాయకత్వం, సేవ వంటి నైపుణ్యంలో మేటిగా నిలిచిన వారిని ఈ అవార్డ్తో సత్కరిస్తారు. ఈ గౌరవం పొందిన గ్రహీత పేరు ఇండియానా మెమోరియల్ యూనియన్లో శాశ్వతంగా ప్రదర్శించబడుతుంది.


