బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కాంతార వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ వివాదంపై ఇప్పటికే దురంధర్ హీరో క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ ఇంకా కోర్టులో ఇంకా నడుస్తోంది. రణ్వీర్ సింగ్ సోషల్ మీడియాలో చెప్పిన సారీ సరిపోదంటూ బెంగళూరుకు చెందిన న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాతపూర్వకంగా క్షమాపణ చెప్పడంతో పాటు కర్ణాటకలోని చాముండి ఆలయాన్ని సందర్శించాలని కోర్టు ఆదేశించింది.
దీనిపై తాజాగా రణ్వీర్ సింగ్ న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు. మరోసారి క్షమాపణ పత్రాన్ని సమర్పిస్తామని రణ్వీర్సింగ్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ముంబైలోని సింధీ కుటుంబంలో పెరగడం వల్ల తనకు ఇక్కడి ఆచారాలు, వాటి సున్నితత్వం గురించి అవగాహన లేదని తన క్షమాపణ పత్రంలో పేర్కొన్నారు. సరైన సమయంలో చాముండి ఆలయాన్ని సందర్శించి.. తన భక్తిని చాటుకుంటానని కోర్టుకు లిఖితపూర్వకంగా అందజేశారు.
అసలు వివాదం ఎంటంటే?
గతేడాది గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో కాంతార మూవీని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. 'కాంతార: చాప్టర్ 1' చిత్రంలోని ఒక కీలక సన్నివేశాన్ని అనుకరించారు. రిషబ్ నటనను ప్రశంసించే సందర్భంలో రిషబ్ అద్భుతమైన నటించారు.. ముఖ్యంగా ఆడ దెయ్యం(చాముండి దైవం) మీ శరీరంలోకి ప్రవేశించే షాట్ అమోఘం అంటూ వేదికపై యాక్షన్ చేస్తూ చూపించారు. ఇదంతా తమ దైవాన్ని కించపరిచేలా రణ్వీర్ ఇమిటేట్ చేశారంటూ పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. పవిత్రమైన దైవాన్ని దెయ్యంగా సంభోధించడం కరెక్ట్ కాదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తీవ్రమైన వ్యతిరేకత రావడంతో రణ్వీర్ సింగ్ బహిరంగంగా క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ ఈ వివాదంకర్ణాటక హైకోర్టుకు చేరింది.


