
కోలీవుడ్లో 'కోమాలి' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్ రంగనాథన్ ఎంట్రీలోనే అనూహ్య విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత లవ్టుడే చిత్రంతో కథానాయకుడిగా పరిచయమై తనే దర్శకత్వం వహించి సూపర్హిట్ కొట్టారు. ఇటీవల డ్రాగన్ చిత్రంలో హీరోగా నటించి సంచలన విజయాన్ని సాధించారు. ఇలా వరుసగా హీరోగా, దర్శకుడిగా విజయాలను అందుకున్న ప్రదీప్ ప్రస్తుతం విఘ్నేశ్శివన్ దర్శకత్వంలో ఎల్ఐకే చిత్రంతో పాటు కీర్తీవాసన్ దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న డ్యూడ్ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు.
ఈ రెండు చిత్రాల షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా తాజాగా మరో సారి ఈయన మెగాఫోన్ పట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీన్ని లవ్టుడే చిత్రాన్ని నిర్మించి సూపర్హిట్ కొట్టిన ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించనుంది. ఇది సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం మాత్రమే చేస్తారా లేక కథానాయకుడిగానూ నటిస్తారా అనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి పూర్తివివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అకాశం ఉంది.