
పవన్ కల్యాణ్- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సుమారు 12 ఏళ్ల క్రితం 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడమే కాకుండా కొన్ని చోట్లు కనీసం రెండురోజులు కూడా ఆడలేదు. అలాంటి అట్టర్ఫ్లాప్ చిత్రాన్ని ఫిబ్రవరి 7న రీరిలిజ్ చేశారు. అందులో తప్పేం లేదు. కానీ సినిమా థియేటర్లలో పవన్ ఫ్యాన్స్ అలజడి రేపారు.
నంద్యాలలో ఏఆర్ మినీ థియేటర్తో పాటు పాలకొల్లులోని మారుతి టాకీస్లో పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సినిమా రన్ అవుతున్న సమయంలో స్క్రీన్కు దగ్గర్లోనే మంటలు వేసి డ్యాన్సులు చేశారు. జనసేన పార్టీ జెండాలు చేతబట్టి కేకలు వేస్తూ ఊగిపోయారు. థియేటర్లో వెదజల్లిన పేపర్లను తీసుకొచ్చి మంటలపై వేయడంతో ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. వెంటనే థియేటర్ యాజమాన్యం అప్రమత్తం కావడం.. ఆపై వెంటనే మంటలను ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో థియేటర్లో సుమారు 400 మంది ఉన్నట్లు సమాచారం. కొన్ని థియేటర్ల వద్ద పవన్ ఫ్లెక్సీలకు బీరుతో అభిషేకం చేయడం మరింత శోచనీయం.
(బ్రో సినిమా సమయంలో ఫైల్ ఫోటో)
పవన్ ఫ్యాన్స్కు ఇదేమీ కొత్త కాదు.. ఖుషీ, తొలిప్రేమ చిత్రాలు రీరిలీజ్ సమయంలో కూడా ఇలాంటి చిల్లర పనులే ఆయన ఫ్యాన్స్ చేశారు. 'బ్రో' సినిమా రిలీజ్ సమయంలో పార్వతీపురంలోని సౌందర్య థియేటర్లో వాళ్లు చేసిన రచ్చ మరింత పీక్స్కు వెళ్లింది. స్క్రీన్పై పవన్ కనిపించగానే వెంటనే కొందరు తెరపై పాలాభిషేకాలు మొదలపెట్టారు. అదే సమయంలో తోపులాట మొదలైంది. ఆ గొడవలో తెర చిరిగిపోయింది. తెర చించిన వ్యక్తుల్ని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. పవన్ సినిమా విడుదలయిన ప్రతిసారి ఇలాంటి ఘటనలు లెక్కలేనన్ని జరుగుతూనే ఉన్నాయి.
(ఇదీ చదవండి: రాజకీయాలపై కొణిదెల ఉపాసన కామెంట్స్)
అభిమానంతో ఇలాంటి పిచ్చి పనులు చేయడమేంటి అంటూ ఎవరైనా కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తే.. తిరిగి వారిపై భూతులతో తిరగబడటం పవన్ ఫ్యాన్స్ నైజం అయిపోయింది. ఇంత జరుగుతున్న పవన్ మాత్రం ఫ్యాన్స్ను ఒకసారి కూడా హెచ్చరించడు. అందుకే వారు కూడా ఇలాంటి పనులు చేసేందుకు ఏమాత్రం వెనకాడరు.ఇకనైన పవన్ ఫ్యాన్స్లో మార్పు వస్తుందని ఆశిద్దాం.