కొన్ని సినిమాల్లో హీరోతో పాటు ఇతర పాత్రలు కూడా బాగా ఎలివేట్ అవుతుంటాయి. అలా ధురంధర్ మూవీలో కథానాయకుడు రణ్వీర్ సింగ్తో పాటు మిగతా అన్ని పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా విలన్గా అక్షయ్ ఖన్నా పోషించిన రెహ్మాన్ డకైత్ పాత్ర అయితే విపరీతంగా హైలైట్ అయింది. అక్షయ్ హావభావాలు, మేనరిజం, డ్యాన్స్.. ఇలా అన్నీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. అయితే ఈ విలన్ పాత్ర కోసం అక్షయ్ కంటే ముందు పలువురు నటీనటులను సంప్రదించగా నిరభ్యంతరంగా తిరస్కరించారట!
ముగ్గురు రిజెక్ట్
ఈ విషయాన్ని కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ చాబ్రా వెల్లడించాడు. బాలీవుడ్ హంగామాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. డకైత్ పాత్రను ముగ్గురు యాక్టర్స్ రిజెక్ట్ చేశారు. అందులో ఒకరు దక్షిణాదికి చెందిన ప్రముఖ నటుడు కాగా మరో ఇద్దరు బాలీవుడ్ యాక్టర్స్. వాళ్లు చెప్పిన కారణమేంటంటే.. ఇందులో చాలా ఎక్కువమంది యాక్టర్స్ పని చేస్తున్నారు. పైగా ఇది పూర్తిగా రణ్వీర్ సినిమా అని ఆఫర్ను తిరస్కరించారు.
ఆయన తప్ప అందరూ..
వారి పేర్లు ఇప్పుడు బయటకు చెప్పలేను కానీ ఆ పాత్రను తిరస్కరించినందుకు వాళ్లు కచ్చితంగా బాధపడే ఉంటారు. ధురంధర్లో నటించేందుకు మొదట అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కూడా కాస్త తటపటాయించారు. ఆర్.మాధవన్ ఒక్కరే వెంటనే ఓకే చెప్పారు, మిగతా అందరూ కాస్త సమయం తీసుకున్నారు. దర్శకుడు ఆదిత్య, నేను.. ఇలా ఎంతోమంది స్టార్స్ను ఈ సినిమాలో భాగం చేయాలని ముందుగానే అనుకోలేదు. కానీ, అలా జరిగిపోయింది అని చెప్పుకొచ్చాడు.
సినిమా
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురంధర్ చిత్రం గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన ధురంధర్: ద రివేంజ్ ఇప్పటివరకు రూ.1500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది.
చదవండి: ఐశ్వర్య ఇంట్లో ఉండాలి.. అంత ఇగో లేదు: అభిషేక్ బచ్చన్


