దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ కొంతకాలంగా యూట్యూబ్పైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. తన వంటమనిషి దిలీప్తో కలిసి రకరకాల వీడియోలు చేస్తోంది. అతడిని వెంటేసుకుని సెలబ్రిటీల హోంటూర్స్ కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి తనీషా ముఖర్జీ ఇంటిని సందర్శించింది ఫరా. ముంబైలో ఉన్న ఈ ఇంట్లో అడుగుపెడితే కోల్కతాకు వెళ్లినట్లుగానే ఉందని అబ్బురపడిపోయింది.
14 ఏళ్లుగా ముంబైలో..
ఇలాంటి ఇల్లు ముంబైలో ఎక్కడా ఉండదని కితాబిచ్చింది. ఇక తనీషా మాట్లాడుతూ.. ఈ ఇంట్లోని సామాను చాలామటుకు తన తల్లి ఇంటి నుంచి వచ్చినవే అని పేర్కొంది. 14 ఏళ్ల క్రితం ముంబైలో అడుగుపెట్టానని, తర్వాత ఇక్కడే సెటిలైపోయానంది. ఈ ఇంటి కోసం మీ అక్క, హీరోయిన్ కాజోల్ ఏమైనా సాయం చేసిందా? అని ఫరా ఆతృతగా అడిగింది. అందుకు తనీషా అవునని బదులిచ్చింది. తను చెక్లపై సంతకం చేసి ఇచ్చేదని, అలా డబ్బు సాయం చేసిందని పేర్కొంది.
తెలుగులోనూ..
బాలీవుడ్ సెలబ్రిటీలు తనూజ- షోము ముఖర్జీల సంతానమే కాజోల్, తనీషా. తక్కువ కాలంలోనే కాజోల్ స్టార్ హీరోయిన్గా రాణించింది. కానీ, తనీషా ఆ స్టార్డమ్ అందుకోలేకపోయింది. ష్, సర్కార్, వన్ టూ త్రీ, సర్కార్ రాజ్, కోడ్ నేమ్ అబ్దుల్ వంటి పలు హిందీ చిత్రాల్లో నటించింది. తెలుగులో కంత్రి మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసింది. హిందీ బిగ్బాస్ ఏడో సీజన్లో పాల్గొని ఫస్ట్ రన్నరప్గా నిలిచింది.
చదవండి: బోల్డ్ వీడియో.. తప్పయిపోయింది, క్షమించండి: నటుడి కూతురు


