ఏఐ వచ్చాక అన్ని రంగాల్లో సరికొత్త సాంకేతికతను అందిపుచ్చకుంటున్నాయి. సినీ ఇండస్ట్రీలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతున్నారు. తాజాగా పూర్తిస్థాయి కృత్రిమ మేధ (ఏఐ)తో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్గా “అంబ’s రివెంజ్” ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు జయవర్ధన్ మాడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లలితకళా చిత్రాలు, నక్క తోక ఫిల్మ్స్ బ్యానర్లపై సంయుక్తంగా శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ కథను ఆధారంగా తీసుకుని వినూత్నంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ.. 'తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాం. “అంబs రివెంజ్” ప్రాజెక్టు కోసం అత్యాధునిక ఏఐ టూల్స్ను వినియోగింతాం. విజువల్స్, పాత్రల రూపకల్పన, కథన నిర్మాణం వంటి అంశాలను కొత్త శైలిలో ఆవిష్కరిస్తున్నాం. హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ను విడుదల చేస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు సంభందించి పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం " అని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమలో ఏఐ ఆధారిత కథాచిత్రాల దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. ఈ పౌరాణిక ప్రయోగాత్మక చిత్రం తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.


