ఏ సినిమా గానీ హిట్ అయిందా? ఫ్లాప్ అయిందా? అని రిలీజైన రోజే అందరికీ అర్థమైపోతుంది. కాకపోతే ఫ్లాప్ అనే నిజాన్ని ఒప్పుకొనే ధైర్యం అందరికీ ఉండదు. కొందరికి మొదట్లోనే సీన్ అర్థమైపోతే మరికొందరికి మాత్రం ఎప్పటికి అర్థం అవుతుందో అని సందేహం కలుగుతుంది. ఎందుకంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంతో గతవారం పలకరించిన దర్శకుడు హరీశ్ శంకర్.. మూవీ ఫ్లాప్ అయినా సరే విడిచిపెట్టట్లేదు. తాను తీసింది సూపర్ హిట్ అనే రేంజులో ప్రమోట్ చేసుకుంటున్నారు. తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్కి ఇచ్చిన సమాధానమైతే మరీ విచిత్రంగా అనిపిస్తుంది. సోషల్ మీడియాలోనూ మొత్తం డిస్కషన్ ఈయన గురించే.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా.. అధికారిక ప్రకటన)
గతంలో పవన్తో 'గబ్బర్ సింగ్' అనే రీమేక్ తీసి హిట్ కొట్టిన హరీశ్ శంకర్.. దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్'తో వచ్చాడు. దాదాపు అప్పటి తరహా టెంప్లేట్ స్టోరీ కావడం, మూసగా ఉందనే నెగిటివ్ టాక్ రావడంతో తొలిరోజు నుంచి నిర్మాతలు సైలెంట్ అయిపోయారు. ప్రతి మూవీకి కలెక్షన్స్ ప్రకటించే వీళ్లు.. 'ఉస్తాద్' విషయంలో మౌనం పాటించారు. అందరికీ అప్పుడే ఫలితం అర్థమైపోయింది. దర్శకుడు హరీశ్ శంకర్ మాత్రం తాను తీసింది హిట్ అనే రేంజులో ఇంటర్వ్యూలు, మీటప్స్ పెడుతూ బిజీ అయిపోయాడు. అందులో ఈయన, హీరోయిన్లు తప్పితే మరో టెక్నీషియన్ కనిపించలేదు.
రెండు నెలల క్రితం అంటే సంక్రాంతికి వచ్చిన 'రాజాసాబ్' రిలీజ్కి ముందు దర్శకుడు మారుతి కూడా ఇలానే చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు. తీరా థియేటర్లలోకి మూవీ వచ్చిన తర్వాత విషయం అర్థమైపోయి సైలెంట్ అయిపోయాడు. అభిమానులు ఎంతలా ట్రోల్ చేసినా సరే అవన్నీ భరిస్తూ వచ్చాడు తప్పితే ఏది పడితే అది మాట్లాడలేదు. హరీశ్ శంకర్ మాత్రం సినిమాలో తప్పుల్ని కూడా సమర్థించుకుంటున్నాడు. పవన్ ఎంట్రీ సీన్పై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ.. మాస్టర్ తీసింది, తాను తీసింది నచ్చడంతోనే రెండుషాట్స్ పెట్టానని చెప్పేసరికి నెటిజన్ల మతిపోతోంది. హిట్ అయిన సినిమా గురించి ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది గానీ ఫ్లాప్ అయిన మూవీ గురించి పదేపదే మాట్లాడినంత మాత్రాన అది హిట్ అయిపోదు. ఈ విషయం హరీశ్ శంకర్ ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో?
(ఇదీ చదవండి: 'రాజాసాబ్' ఫ్లాప్ నుంచి కోలుకున్న మారుతి.. పోస్ట్ వైరల్)


