ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాశ్ గోపరాజు హీరోగా నటించిన తాజా చిత్రం కొత్త మలుపు. దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని కోనసీమ నేపథ్యంలో రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ మూవీగా రూపొందించారు. తాజాగా ఈ మూవీ జూన్ 12న థియేటర్లలో విడుదలైంది. ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కొత్త మలుపు కథేంటంటే..
జీవితాన్ని ఎంజాయ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని స్నేహితులతో కలిసి హైదరాబాద్లో హ్యాపీగా గడిపే యువకుడు కమల్ (ఆకాశ్). ఓ కుటుంబ వివాహ వేడుక కోసం తూర్పు గోదావరి జిల్లాలోని అందమైన గ్రామానికి వెళ్తాడు. అక్కడ వరలక్ష్మి (భైరవి ఆర్థ్యా) అనే గ్రామీణ యువతిని చూసి ఆకర్షితుడవుతాడు. ఒక రాత్రి అనుకోని పరిస్థితుల్లో అవమానకర స్థితిలో చిక్కుకున్న కమల్ను ఓ యువతి కాపాడుతుంది. అయితే ఆమె ఎవరో తెలియదు. తనను ఆదుకున్న ఆ అమ్మాయి కోసం కమల్ చేసే అన్వేషణలో వరలక్ష్మి అతనికి తోడుగా నిలుస్తుంది. ఈ ప్రయాణంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.
అయితే, తాను వెతుకుతున్న అమ్మాయి వరలక్ష్మినేనని తెలుసుకునేలోపే, ఆమె మరో యువకుడితో ఉన్న ఫోటో కమల్ చేతికి చిక్కుతుంది. దాంతో ప్రేమలో అనుమానాలు, అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఆ యువకుడు ఎవరు? వరలక్ష్మికి అతనితో సంబంధం ఏమిటి? ఈ అపార్థాల మధ్య కమల్-వరలక్ష్మి ప్రేమ ఎలాంటి పరీక్షలు ఎదుర్కొంది? చివరికి వారి ప్రేమ గెలిచిందా లేదా? అన్నదే కొత్త మలుపు కథ.
ఎలా ఉందంటే..
ప్రేమ, అపార్థాలు, నమ్మకం, గతం-వర్తమానం మధ్య జరిగే భావోద్వేగ సంఘర్షణను దర్శకుడు శివ కేసనకుర్తి చక్కగా తెరపై ఆవిష్కరించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథకు గోదావరి ప్రాంతం అందాలను జోడించి ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించారు. సినిమా ప్రారంభం నుంచే ప్రేక్షకుడికి మంచి ఫీల్ను కలిగిస్తుంది. పల్లెటూరి విజువల్ అద్భుతంగా ఉన్నాయి. పెళ్లి సందడి, హీరో-హీరోయిన్ల మధ్య నడిచే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా ఫస్టాఫ్లో వచ్చే కామెడీ ఎపిసోడ్స్, గోదావరి కామెడీ మంచి ఎంటర్టైనింగ్గా అనిపించాయి.
రెండో అర్ధభాగంలో కథ భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. ప్రేమలో అనుమానం ఎంత ప్రమాదకరమో డైరెక్టర్ ఇందులో చూపించారు. ఒకరి గతాన్ని పట్టుకుని తీర్పు చెప్పడం ఎంత తప్పో చెప్పే ప్రయత్నంలో దర్శకుడు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో వచ్చే సందేశం నేటి యువతకు ఎంతో అవసరమనే మెసేజ్ ఇచ్చాడు డైరెక్టర్. "ప్రతి ఒక్కరికీ ఒక గతం ఉంటుంది. కానీ మన జీవితంలోకి వచ్చిన వ్యక్తి వర్తమానాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. గతాన్ని తవ్వుకుంటూ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు" అనే ఒక్క డైలాగ్లో తన స్టోరీ సారాంశం చెప్పేశారు.
ఎవరెలా చేశారంటే..
కమల్ పాత్రలో ఆకాశ్ అదరగొట్టేశారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. హీరోయిన్ భైరవి వరలక్ష్మి పాత్రలో మెప్పించింది. రఘుబాబు, పృథ్వీ తమ కామెడీ టైమింగ్తో గోదావరి యాసలో అలరించారు. గోపి పాత్రలో సిద్ధు మంచి నటన కనబరిచాడు. ఇక సాంకేతికత విషయానికొస్తే యశ్వంత్ నాగ్ సంగీతం ఆకట్టుకుంది. సుమంత్ కచర్ల సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి ప్రాంతంలోని ప్రకృతి అందాలను అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్లో మరింత పని చెప్పాల్సి ఉంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.


