నటుడు సూర్య ఒక్కసారి కథను నమ్మితే, ఆ చిత్రం కోసం ప్రాణం పెడతారనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. అలా ఆయన ప్రతి చిత్రానికి తన వంతు కృషి చేస్తారు. ఇక జయాపజయాలు అన్నది ఎవరి చేతిలోనూ ఉండవు. కంగువా చిత్రం విషయంలో కూడా జరిగింది ఇదే. భారీ బడ్జెట్లో తెరకెక్కిన చిత్రం అది. ఆ చిత్రంలో నటుడు సూర్య నటనను ఎవరూ విమర్శించలేదు సరికదా విమర్శకులు సైతం ప్రశంసించారు. అనివార్య కారణాల వల్ల కంగువా చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఇకపోతే ఆ తరువాత సూర్య నటించిన రెట్రో చిత్రం కమర్శియల్గా మంచి విజయాన్నే అందుకుంది.
కాగా సూర్య ప్రస్తుతం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కరుప్పు చిత్రాన్ని పూర్తి చేశారు. ఈచిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించిన చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. తాజాగా మాలీవుడ్ దర్శకుడు జీతు మాదవన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ఈయన నటిస్తున్న 47వ చిత్రం కావడం గమనార్హం. ఇందులో ఆయన మరోసారి తనకు బాగా కలిసొచ్చిన పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు.
కర్ణుడిగా సూర్య
హిందీ చిత్రంలో నటించడానికి సూర్య సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మహాభారతం ఇతిహాసంలోని కర్ణుడి ఇతి వృత్తంతో పాన్ ఇండియా స్థాయిలో కర్ణ పేరుతో భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు,అందులో కర్ణుడి పాత్రలో నటుడు సూర్య, నటి జాన్వీకపూర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లు 2024లో ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.దీంతో కర్ణ చిత్రం అనివార్య కారణాల వల్ల డ్రాప్ అయ్యిందనే ప్రచారం వైరల్ అయ్యింది. అలాంటిది ఇటీవల దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ ఒక భేటీలో పేర్కొంటూ కర్ణ చిత్రం డ్రాప్ కాలేదనీ, దీని కోసం ఆరేళ్ల క్రితమే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించినట్లు చెప్పారు.
ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొంచాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీనికి స్క్రీన్ప్లేను పూర్తిగా రాసినట్లు ఇక షూటింగ్ను ప్రారంభించడమే తరువాయి అని చెప్పారు. కొన్ని కారణాల వల్ల చిత్ర షూటింగ్ వాయిదా పడింది కానీ, డ్రాప్ కాలేదని స్పష్టం చేశారు.ఈ చిత్రం కోసం ఏఆర్.రెహామాన్ ఆరు పాటలను రెడీ చేశారని దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ తెలిపారు. మొత్తం మీద సూర్యను ఆయన అభిమానులు కర్ణుడిగా చూడబోతున్నారన్నమాట.


