కలెక్టర్ ప్రతిమా సింగ్
చేగుంట(తూప్రాన్): గర్భిణులు ఆరోగ్యంపై వైద్య సిబ్బంది ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. మంగళవారం పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి సంబంధించిన రికార్డులు, గదుల్లోని వసతులను పరిశీలించారు. ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చిన రోగులను కలిసి, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం వైద్య సిబ్బందితో కలెక్టర్ సమావేశమై పలు సూచనలు చేశారు. గర్భిణులకు మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, హైరిస్క్ కేసుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే జిల్లా ఆస్పత్రి నుంచి అవసరమైన సహకారం తీసుకోవాలని ఆదేశించారు. సిబ్బంది విధిగా సమయపాలన పాటించి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సౌజన్య, నాగమల్లీశ్వరీ, సీహెచ్ఓ అనీసోద్దీన్ తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
రైస్మిల్లులో తనిఖీలు
శివ్వంపేట(నర్సాపూర్): శివ్వంపేటలోని ఓం సాయి వెంకటరమణ రైస్మిల్లో మంగళవారం ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 2022– 23 రబీ సీజన్లో ప్రభుత్వం ఈ మిల్లుకు 6,996 టన్నుల ధాన్యాన్ని కేటాయించారు. అయితే, మిల్లులో నిల్వలను పరిశీలించగా 241 టన్నుల ధాన్యం (సుమారు 6,026 బస్తాలు) తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కేటాయించిన ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు మిల్లులో తగినంత గోదాం సదుపాయం లేకపోవడంతో ఆరుబయట నిల్వ చేయాల్సి వచ్చిందని యజమానులు తెలిపారు. ఈ క్రమంలో వర్షాలకు వడ్ల బస్తాలు తడిసి పాడైపోవడంతో పాటు, కోతుల బెడద కారణంగా ధాన్యం నష్టం వాటిల్లిందని అధికారులకు వివరించారు. తక్కువగా వచ్చిన 241 టన్నుల ధాన్యం విలువ రూ. 53,91,000 ప్రభుత్వానికి రికవరీ కింద చెల్లించాలని అధికారులు స్పష్టం చేశారు. స్పందించిన మిల్లు యజమానులు ఆ మొత్తాన్ని చెల్లిస్తామని లిఖితపూర్వకంగా రాసిచ్చినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో మెదక్ సివిల్ సప్లయి ఆర్ఐ నర్సింలు, హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.
తైవాన్లో మెరిసిన
ఐఐటీహెచ్ విద్యార్థులు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: తైవాన్ నేషనల్ యూనివర్సిటీ ఆ దేశంలో నిర్వహించిన అంతర్జాతీయ పోటీలో హైదారాబాద్ ఐఐటీ విద్యార్థులు ప్రతిభను చాటారు. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థుల బృందం ప్రదర్శనకు అంతర్జాతీయస్థాయిలో ఎక్స్లెన్స్ అవార్డు వరించింది. రూ.1.5 లక్షల నగదు బహుమతి అందుకున్నారు. ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ విభాగానికి చెందిన విద్యార్థులు మహక్గాడియా, రాఖీమహమ్మద్, మెకానికల్ విభాగానికి చెందిన ఉదిత్మైనీ, ఇంజనీరింగ్ ఫిజిక్స్కు చెందిన యుగ్నికేష్లు సోలార్ ప్యానెల్స్పై చేస్తున్న పరిశోధనలను ప్రదర్శించారు. 70 సెం.మీల ఉష్ణోగ్రతతో పాటు, అత్యధిక తేమను తట్టుకోగలిగిన 25 సెం.మీ స్కొయర్ ప్యానెల్స్లను ప్రదర్శించారు. అంతర్జాతీయ జ్యూరీ విభాగం ఈ ప్రదర్శనను ఎక్స్లెన్స్ అవార్డుకు ఎంపిక చేసింది. అవార్డు దక్కించుకున్న విద్యార్థులను ఐఐటీహెచ్ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీఎస్ మూర్తి, ఈ బృందం సూపర్వైజర్ ఆశిశ్కులకర్ణిలు అభినందించారు.
సోలార్ ప్యానెల్స్పై పరిశోధనకు ౖతైవాన్ ఎక్స్లెన్స్ అవార్డు
ప్రతిభ చాటిన హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులు


