మెదక్ కలెక్టరేట్: రాజీపడదగిన కేసుల్లో రాజీ పడటమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ పేర్కొన్నారు. శనివారం జిల్లాలో 5 బెంచ్ల ద్వారా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి నీలిమ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఒకేరోజు 6351 కేసులు పరిష్కారమవడం హర్షనీయమన్నారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్, అల్లాదుర్గం కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించినట్లు చెప్పారు. కేసుల్లో రాజీ పడడంతో ఇరువురికి న్యాయం జరుగుతుందన్నారు. జాతీయ లోక్ అదాలత్ల ద్వారా ఇరువర్గాలకు కేసుల పరిష్కారంతో పాటు సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. కార్యక్రమంలో ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్, జడ్జి ఆర్.ఎం.సుభవల్లి, సీనియర్ సివిల్ జడ్జి, ఆర్. సిరిసౌజన్య, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సాయిప్రభాకర్, అన్ని కోర్టుల సిబ్బంది, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ


