వర్గల్(గజ్వేల్): ‘సాక్షి’ కథనానికి స్పందన లభించింది. అయిదేళ్ల నిరీక్షణకు తెరపడింది. భారీ జలాశయం ‘బంధం’ చెరువు మరమ్మతులకు మోక్షం లభించింది. రైతుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. కొండపోచమ్మ సాగర్ జలాలను హల్దీవాగులోకి తరలించే కీలక ఫీడర్ చానల్గా ప్రాధాన్యత కలిగిన చౌదరిపల్లి ‘బంధం’ చెరువు దుస్థితి వెల్లడిస్తూ ఈ నెల 21న ‘బంధం..బలహీనం’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ మేరకు స్పందించిన అధికారులు ఆదివారం చెరువు మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. చెరువులో నీళ్లు అడుగంటిపోగా, కట్టవైపు మరమ్మతు పనులకు అవరోధం కలగకుండా మిగతా నీరు వెళ్లిపోయేలా ‘ట్రెంచ్’ (కాలువ) తవ్వారు. కట్టమీద చెట్ల తొలగింపు పనులు వేగవంతం చేశారు.


