సంగారెడ్డి ఎడ్యుకేషన్: పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోయేలా చేసిన ప్రతిపక్షాలకు మహిళలపై ఉన్న ప్రేమ ఎలాంటిదో స్పష్టంగా అర్థమవుతుందని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యాఖ్యానించారు. కందిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ...పార్లమెంట్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లును ఇండియా కూటమి వ్యతిరేకించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లు వీగిపోతే గ్రామ గ్రామాల సంబరాలు జరుపుకోవడం ఏంటని ప్రశ్నించారు. మహిళా బిల్లును వ్యతిరేకించడమంటే దేశంలో ఉన్న మహిళలను అవమానించడమేనని తెలిపారు. దేశంలో డీలిమిటేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 లక్షల నుంచి 33 లక్షల వరకు ఓటర్లు ఉన్నారని అంత జనాభా ఉన్న నియోజకవర్గంలో కొత్తగా మరొకటి ఏర్పడితే వచ్చే నష్టమేమీ లేదని వివరించారు. మరో నియోజకవర్గం ఏర్పడటం వలన కొత్త రాజకీయ నాయకులు, యువకులు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజేశ్వర్రావ్ దేశ్పాండే, మీనాగౌడ్, విఠల్, వెంకటనర్సింహారెడ్డి, మాణిక్రావు, జ్యోష్ణ, తేజశ్రీ, అరుణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పాయల్ శంకర్


