నర్సాపూర్ రూరల్: దళారుల చేతుల్లో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి రైతులకు సూచించారు. సోమవారం మండలంలోని ఖాజీపేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి, రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల నిర్వాహకులు మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీఓ సిద్ధిరాంరెడ్డి, ఏపీఎం సంగమేశ్వర్, వీఓ స్వప్న తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమానికి పెద్దపీట
పెద్దశంకరంపేట(మెదక్): ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని మల్కాపూర్, మక్తలక్ష్మాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి మాట్లాడారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ మాణిక్యం, డీఈ ప్రసన్న, ఎంపీడీఓ క్రాంతికుమార్, నాయకులు నారాగౌడ్, సంగమేశ్వర్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పెరుమాండ్లుగౌడ్, సర్పంచ్లు రాజేశ్వరి, రాజునాయక్, రవీందర్, శ్రీనివాస్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
బిల్లు వీగిపోవడానికి
బీజేపే కారణం
నర్సాపూర్: బీజేపీ కుట్ర పూరితంగా వ్యవహరించినందునే 131 రాజ్యాంగ సవరణ చట్టం బిల్లు వీగి పోయిందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి ఆరోపించారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ చట్టం తీసుకురావడానికి ప్రధాని మోదీ కుట్ర చేశారని మండిపడ్డారు. మహిళలకు రిజర్వేషన్ తీసుకురావాలన్న ఉద్దేశం కేంద్రానికి లేదన్నారు. మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ గతంలో మహిళలకు స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్ తీసుకువచ్చిందని తెలిపారు. వారి వెంట నాయకులు గంగాధర్, సుదర్శన్గౌడ్, రవీందర్యాదవ్, నరేశ్ తదితరులు ఉన్నారు.
రైతులను ఆదుకుంటాం
చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండల కేంద్రంతో పాటు వల్లూర్, బీమ్రావుపల్లి గ్రా మాల్లో అకాల వర్షంతో తీవ్ర నష్టం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మొత్తం 538 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు ఏఓ భరత్ కుమార్ తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ సోమవారం దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు నష్టపరిహరం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే దుబ్బాక కాంగ్రెస్ ఇన్చార్జి శ్రీనివాస్రెడ్డి నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.


