మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ ఇతర కార్యక్రమాలకు వెళ్లగా, అదనపు కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. కాగా వివిధ సమస్యలపై ప్రజలు 74 అర్జీలు అందజేశారు. మెదక్ పట్టణంలోని మల్లం చెరువు గుర్రపు డెక్క, మురికి నీటితో కంపు కొడుతుందని చర్యలు తీసుకోవాలని మెదక్ సీనియర్ సిటిజన్ ఫోరం నాయకుడు సత్యనారాయణ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అలాగే శివ్వంపేట మండలం చండి నుంచి గంగావాయిపల్లి, జగ్యాతండా వరకు ప్రభుత్వం రోడ్డు మంజూరు చేసిందని, మా తాతల తరం నుంచి ఇదే రోడ్డు గుండా వెళ్తున్నామని, ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని గిరిజనులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.


