● సిద్దిపేటను ప్రగతి బాటపట్టిస్తా
● అర్హులందరికీ సంక్షేమ పథకాలు
● త్వరలో రెండు లక్షల కొత్త పింఛన్లు
● కార్మిక శాఖ మంత్రి వివేక్
సిద్దిపేటజోన్: సిద్దిపేటను అభివృద్ధి బాటలో తీసుకెళ్లే బాధ్యత నాపై ఉందని, అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ అన్నారు. సిద్దిపేట ప్రాంతంతో మా కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎనిమిదవ వార్డులో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలన అంటే ప్రజాపాలనగా అభివర్ణించారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. త్వరలోనే రెండు లక్షల కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. అదేవిధంగా సిద్దిపేట నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, మరో రెండు వేల ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో డ్రైనేజీ నిర్మాణానికి త్వరలో ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. అందరూ కష్టపడి పని చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. వార్డుల్లో కాంగ్రెస్ కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి హరికృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్లు యాదగిరి, మహేందర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.


