వెల్దుర్తి(తూప్రాన్): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఇంటి నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ఉప్పులింగాపూర్లో ఎమ్మెల్యే కోటా కింద మంజూరైన వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులు ముందుకు రావడం లేదన్నారు. అధికారుల సమక్షంలో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలని చెప్పారు. అలాగే, వెల్దుర్తి– మెదక్ రహదారి గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని .. త్వరలో డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమాదేవి, ఎంపీఓ నవీన్, గృహ నిర్మాణశాఖ అధికారులు, సర్పంచ్లు పాల్గొన్నారు.
ఇందిరమ్మ లబ్ధిదారులకు
రూ:127 కోట్లు చెల్లింపు
అల్లాదుర్గం(మెదక్): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.127 కోట్ల బిల్లులు చెల్లింపులు పూర్తయ్యాయని హౌసింగ్ పీడీ మాణిక్యం తెలిపారు. అల్లాదుర్గంలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 9,098 గృహాలను మంజూరయ్యాయని తెలిపారు. అందులో 6,768 గ్రౌండింగ్ కాగా, 691 ఇళ్లు పూర్తిస్థాయిలో నిర్మించారన్నారు. పునాది లెవల్లో 1,537, రెంటల్ లెవల్ 821 ఇళ్లు ఉన్నాయన్నారు. మంజూరైన ఇళ్లను లబ్ధిదారులు ప్రారంభించకపోతే వాటిని రద్దుచేసి, అర్హులైన వారికి మంజూరు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈఈ ప్రసన్న, ఏఈ అక్రమ్, ఎంపీడీఓ చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేషారెడ్డి, నాయకులు బల్రాం, మహేశ్, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీ కళాశాల
లెక్చరర్కు డాక్టరేట్
నర్సాపూర్: నర్సాపూర్లోని తెలంగాణ ప్రభుత్వ మైనార్టీ బాలుర గురుకుల కళాశాలకు చెందిన లెక్చరర్ కె.భిక్షపతికి డాక్టరేట్ వచ్చింది. స్థానిక కాలేజీలో వృక్షశాస్త్ర జూనియర్ లెక్చరర్గా పని చేస్తున్న భిక్షపతి ఉస్మానియా యూనివర్సిటీ వృక్షశాస్త్ర విభాగం ప్రొఫెసర్ కమలాకర్ ఆధ్వర్యంలో పరిశోధనలు చేసి డాక్టరేట్ సాధించారు. కాగా తనకు డాక్టరేట్ రావడం పట్ల ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. కాలేజీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ మురళీ ఇతర సిబ్బంది డాక్టరేట్ సాధించిన భిక్షపతిని అభినందించారు.
ఉపాధ్యాయుల
సమస్యలు పరిష్కరించాలి
టీజీఈజేఏసీ నేత లక్ష్మణ్
మెదక్జోన్: ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) నాయకుడు చల్లా లక్ష్మణ్ హెచ్చరించారు. శుక్రవారం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆ సంఘం నేతలతో కలిసి తహసీల్దార్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు వెంటనే బిల్లుల విడుదల చేయాలన్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానం అమలు చేయాలని కోరారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సాధారణ బదిలీలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో టీజీఈ జేఏసీ జిల్లా నాయకులు స్వరూప రాణి, బాల్శెట్టి , మాధవరెడ్డి, నరేందర్, సత్యనారాయణ పాల్గొన్నారు.


