రమణీయం రథోత్సవం
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల జాతరలో మంగళవారం రాత్రి రథోత్సవం కనులవిందుగా సాగింది. ఉదయం నుంచే భక్తులు దుర్గమ్మ తల్లిని దర్శించుకుని పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జోగినులు బోనాలతో చిందులు వేశారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి, రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. సునీతారెడ్డికి ఆలయ సిబ్బంది స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సత్కరించారు.
కనుల పండువగా రథోత్సవం
జాతరలో మూడవరోజు రథోత్సవం వేలాది భక్తుల మధ్య కనుల పండువగా జరిగింది. గర్భగుడిలో దుర్గమ్మ తల్లి ఉత్సవ విగ్రహాన్ని పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తజనుల నినాదాల మధ్య ఉత్సవ విగ్రహాన్ని పల్లకీపై ఉంచి రథం వరకు తీసుకొచ్చారు. ఆచారం ప్రకారం ఆలయాధికారులు, నాగ్సాన్పల్లి గ్రామంలోని వతన్దారులు, 18 మంది పని బాటల వారికి, హక్కు బాపతులు అప్పగించి కార్యక్రమ నిర్వహణకు ఆహ్వానించారు. అదనపు ఎస్సీ మహేందర్, వివిధ శాఖల అధికారులను సన్మానించారు. వివిధ శాఖల అధికారులు, భక్తులు తాళ్లతో రథాన్ని లాగుతూ భవానీమాతకు జై అంటూ ముందుకు కదిలారు. రథం గోలి వద్ద నుంచి ఆలయం ముందునున్న రాజగోపురం వరకు రథోత్సవాన్ని నిర్వహించారు. రథయాత్రకు ఇరు ప్రక్కలా బారులు తీరిన భక్తులు దుర్గామాతకు జై అంటూ నినదించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు ఎస్పీ మహేందర్, ఎస్సై శ్రీనివాస్గౌడ్తోపాటు సుమారు 500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఏడుపాయల్లో భక్త జనసందోహం
బోనాలతో చిందులు వేసిన జోగినులు
రమణీయం రథోత్సవం


