సన్నాలకు బోనస్
మెదక్జోన్: సన్నాలను సాగుచేసిన అన్నదాతలను సర్కార్ ముప్పు తిప్పలు పెడుతోంది. ధాన్యం విక్రయించి ఏడాది కావస్తుండగా, పాత బకాయిలను పెండింగ్లో పెట్టిన ప్రభుత్వం, కొత్త బకాయిలను మాత్రమే విడుదల చేయటంపై సర్వత్రా రైతులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక సన్నాలను సాగు చేస్తే అదనంగా క్వింటాల్కు రూ.500 చొప్పున ఇస్తామనటంతో అధిక ఖర్చులు భరించి రైతులు సన్నాల సాగు చేస్తున్నారు. 2025 సంవత్సరం యాసంగిలో జిల్లాలో మొత్తం 2.75 లక్షల ఎకరాల వరిసాగు సాగు చేయగా, అందులో 40 వేల ఎకరాలలో 14వేల పైచిలుకుమంది రైతుల సన్నాలను సాగు చేశారు. ఇందుకుగానూ 62,994 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం దిగుబడి రాగా కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించారు. ఇందుకుగాను సదరు రైతులకు రూ.31.37 కోట్లు చెల్లించాల్సి ఉండగా నేటికీ చెల్లింపులు జరగలేదు. అలాగే 2025 వానాకాలంలోనూ మొత్తం 3.56 లక్షల ఎకరాలలో జిల్లావ్యాప్తంగా వరిసాగు చేయగా అందులో 38,052 మంది రైతులు 1,27,029 ఎకరాల్లో సన్నాలను సాగు చేశారు. ఇందుకుసంబంధించి 1,43,212 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించారు. రైతులకు రూ.71.61 కోట్లు చెల్లించాల్సి ఉండగా, గత మూడు విడతల్లో అన్నదాతలకు 60% డబ్బులు చెల్లించగా, చివరగా ఈనెల 16న, నాలుగవ విడతలో పూర్తి మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. అయితే గతేడాది రబీసీజన్లో బకాయిపడిన రూ.31.37 కోట్లు అలాగే పెండింగ్లో ఉన్నాయి. పాత బకాయిలు కొత్తవి మాత్రమే ఇచ్చారని, మారి పాత బకాయిలు ఎప్పుడిస్తారంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
వరుసగా నిర్వహిస్తున్న ఎన్నికల నేపథ్యంలో సర్కార్ వద్ద పెండింగ్లో ఉన్న పథకాలకు సంబంధించి నిధులను కొంతమేర విడుదల చేస్తోంది. పంచాయితీ ఎన్నికల ముందు మహిళా సంఘాలకు చెల్లించాల్సిన వడ్డీ డబ్బులతోపాటు వడ్డీని విడుదల చేసిన ప్రభుత్వం, మున్సిపల్ ఎన్నికలకు ముందు సైతం మెప్మా ఆధ్వర్యంలో మున్సిపాలిటీల్లో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు సైతం విడుదల చేసింది. కాగా రేపోమాపో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వాహణకు నోటిఫికేషన్ విడుదల కానుండటంతో రైతులకు రెండు సీజన్లలో బకాయి పడిన సన్న ధాన్యం డబ్బుల్లో వానాకాలం డబ్బులను విడుదల చేసిందని పలువురు పేర్కొంటున్నారు.
పాతవి పెండింగ్... కొత్తవి విడుదల
గతేడాది యాసంగి సీజన్
రూ.31.37 కోట్లు పెండింగ్
వానాకాలం సీజన్ రూ.71.61 కోట్లు
నాలుగు విడతల్లో విడుదల
రైతన్నలకు తప్పని ఎదురు చూపులు


