పకడ్బందీగా మ్యాపింగ్ ప్రక్రియ
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ రాహుల్రాజ్
నర్సాపూర్: జిల్లాలో మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్రాజ్ చెప్పారు. మంగళవారం ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన ఆర్డీఓ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మ్యాపింగ్ ప్రక్రియను చేపడుతామని చెప్పారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, అందుకుగాను గ్రామ పాలన అధికారులు ఇతర అధికారులను మ్యాపింగ్ ప్రక్రియలో సహాయకులుగా నియమించి ప్రక్రియ త్వరలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్ ఉన్నారు.
జవాబుదారీగా పనిచేస్తేనే గుర్తింపు
మెదక్ కలెక్టరేట్: జవాబుదారీగా పనిచేస్తేనే ప్రజల్లో గుర్తింపు ఉంటుందని, సుపరిపాలన అందించేందుకు ఉద్యోగులందరూ కృషి చేయాలని నూతన ట్రైనీ గ్రూప్ 1 అధికారులకు కలెక్టర్ రాహుల్రాజ్ పిలుపునిచ్చారు. మెదక్ కలెక్టరేట్లో నూతన ట్రైనీ గ్రూప్1 అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ట్రైనీ అధికారులు శిక్షణ అనంతరం ఉద్యోగ బాధ్యతలలో అవినీతికి తావులేకుండా సుపరిపాలన అందించాలన్నారు. పారదర్శకంగా, జవాబుదారీగా ఉద్యోగం చేసినప్పుడే ప్రజల్లో గుర్తింపు వస్తుందన్నారు. దేశంలో గ్రామీణ వ్యవస్థ చాలా పెద్దదని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల అభివృద్ధే దేశాభివృద్ధి అన్నారు. అధికారులు సేవల్లో తమ చుట్టూ ఉన్న వనరులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఉద్యోగ సేవల్లో టెక్నాలజీని కూడా ఉపయోగించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీసీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి
మెదక్ కలెక్టరేట్: సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి నీలిమ ఆధ్వర్యంలో బంజారా సంఘం నాయకులతో ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈనెల 19న మెదక్, 20న నర్సాపూర్ నియోజకవర్గాల్లో నిర్వహించే సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను నిర్వహించాలని కోరారు. ఇందుకోసం పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. రెండు నియోజకవర్గ కేంద్రాలలో శాసనసభ్యుల ద్వారా ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. పెద్ద ఎత్తున శోభాయాత్రలు, సేవాలాల్ మహారాజ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి, ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
కలెక్టర్ రాహుల్రాజ్


