దండేపల్లి: ప్రభుత్వం సేకరించిన రూ.15.70 కోట్ల విలువైన వరి ధాన్యాన్ని సీఎంఆర్ (కస్టమ్స్ మిల్లింగ్) కోసం రైస్మిల్కు అప్పగిస్తే సదరు మిల్లు యజమానిపై పక్క దారి పట్టించాడు. జిల్లా సివిల్ సప్లయ్ డీఎం శ్రీకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మిల్లు యజమానిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై రాజవర్ధన్తో కలిసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. దండేపల్లి మండలం లింగాపూర్ సమీపంలోని రామ్ లక్ష్మణ్ రైస్మిల్కు 2022–23, 2023–24 సీజన్లలో యాసంగిలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వార కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసింది. అందులో రామ్ లక్ష్మణ్ మిల్లుకు 9,244.206 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సీఎంఆర్ కోసం అప్పగించింది. అందులో 6,286.206 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అప్పగించాల్సి ఉండగా, కేవలం 1,833.511 మెట్రిక్ టన్నులు మాత్రమే అప్పగించాడు. వీటితో పాటు గత సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ను ప్రభుత్వానికి అందించకుండా, వరిధాన్యంతో పాటు, బియ్యాన్ని అక్రమంగా పక్కదారి పట్టించి రూ.15.70 కోట్ల ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలిందన్నారు. మిల్లువద్ద తనిఖీలు నిర్వహించగా, ప్రభుత్వానికి సంబంధించిన వరిధాన్యం, బియ్యం నిల్వలు లభించలేదన్నారు. దీంతో మిల్లు యజమాని గంప సంతోష్ను అరెస్టు చేసి లక్సెట్టిపేట కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించినట్లు సీఐ పేర్కొన్నారు.


