జన్నారం: పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు ఎంతో ఉత్సాహంగా వెళ్తున్న ఆ యువకుడిని బైక్ రూపంలో మృత్యువు కబళించింది. మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు జన్నారం మండలం చింతగూడకు చెందిన గుండ మల్లేశ్, సుజాత దంపతుల కుమారుడు రాకేష్ (22) హైదరాబాద్లో హోటల్ మేనేజ్మెంట్ చేస్తూ బండ్లగూడలో ఉంటున్నాడు. మంగళవారం అతని పుట్టినరోజు కావడంతో కేక్ కట్చేద్దామని నార్సింగ్లో ఉన్న అతని స్నేహితులు పిలవడంతో సోమవారం రాత్రి 12 గంటలు దాటిన తర్వాత బైక్పై బయలుదేరాడు. మార్గమధ్యలో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో కిందపడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరారు. యువకుడి మరణంతో చింతగూడలో విషాదం చోటు చేసుకుంది.


