కాసిపేట(బెల్లంపల్లి): సురక్షిత ప్రయాణం, మత్తురహిత సమాజమే లక్ష్యంగా కృషి చేద్దామని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. మంగళవారం బెల్లంపల్లి డివిజన్ తాళ్లగురిజాల గ్రామంలో బెల్లంపల్లి రూరల్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి యువతకు అరైవ్–అలైవ్ ద్వారా అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫి క్ నిబంధనలు, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల ద్వారా కలిగే దు ష్పరిణామాలపై అవగాహన కల్పించారు. యువత స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. ఆర్మీ, పోలీస్ శాఖల్లో ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువకులు ఉత్సాహంగా పుష్–అప్స్ ప్రదర్శించగా వారి ప్రతిభను అభినందించారు. ఓ యువకుడిని సీపీ సన్మానించి రూ.500 నగదు బహుమతి అందజేశారు. బెల్లంపల్లి డీసీపీ భాస్కర్, ఏసీపీ కిరణ్కుమార్, సీఐ హనుక్, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి
పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. బెల్లంపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. పెండింగ్ కేసులు, దర్యాప్తు వివరాల గురించి సీఐ హనుక్ను అడిగి తెలుసుకున్నారు. సర్కిల్ పరిధిలో రోజువారీగా నమోదవుతున్న ఫిర్యాదులు, కేసుల రికార్డులు పరిశీలించి, పెండింగ్ కేసుల స్థితిగతులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తునకు సంబంధించి ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. గ్రేవ్ కేసుల్లో జాప్యం లేకుండా నిందితులను త్వరగా అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచాలని సూచించారు. విచారణ, దర్యాప్తు సమయంలో భౌతిక సాక్ష్యాలతో పాటు సాంకేతిక ఆధారాలను వినియోగించాలని తెలిపారు. నేరాల నియంత్రణ, దొంగతనాల నిర్మూలనకు అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే తనిఖీలు చేపట్టాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పెట్రోలింగ్ నిర్వహించాలని, డ్రండెన్డ్రైవ్ నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని తెలిపారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులకు భద్రత, భరోసా కల్పించేలా పోలీస్ వ్యవస్థ పనిచేయాలని తెలిపారు. అనంతరం అధికారులతో కలిసి మొక్కలు నాటారు. డీసీపీ భాస్కర్, రూరల్ సీఐ హనుక్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


