శ్రీరాంపూర్: ‘అమెరికాలో పెద్ద చదువులు చదివి గొప్పగా తిరిగొస్తదని ఆశించా ం. కూడబెట్టిన డబ్బుతోపాటు అప్పు చేసి బిడ్డను చదువు కోసం అంతదూరం పంపించాం. అక్కడ జరిగిన ప్రమాదంలో గాయపడ్డది. అపస్మారక స్థితికి చేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.. బిడ్డను చూసేందుకు వెళ్లేదెట్లా..’ అంటూ ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నస్పూర్ షిర్కే ప్రాంతానికి చెందిన లగిశెట్టి శ్రీనివాస్, సునీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు స్పందన, సౌమ్య ఉన్నారు. శ్రీనివాస్ వ్యాన్డ్రైవర్గా పనిచేస్తూ పిల్లలను చదివిస్తున్నాడు. ఉన్నత చదువులు చదివించాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి కూడబెట్టిన డబ్బుతోపాటు అప్పు చేసి పెద్ద కూతురు స్పందనను అమెరికాలోని చికాగోకు పంపించాడు. అక్కడి కాలేజీలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. గత నెల 31న కాలేజీకి వెళ్లి వస్తుండగా మెట్రోస్టేషన్లో మెట్లపై 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడింది. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తు తం కోమాలో ఉందని, పరిస్థితి విషమంగా ఉందని తోటి విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అక్కడ తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎంతో కష్టపడి అక్కడ ఇక్కడ పోగు చేసిన డబ్బులతో కూతురిని అమెరికా వరకు పంపించారు. ఇప్పుడు ఆమె ను చూడడం కోసం అక్కడికి వెళ్లాడానికి వారికి ఆర్థి క ఇబ్బందులు అడ్డుగా మారాయి. పాస్పోర్టు కూ డా లేకపోవడంతో దరఖాస్తు చేసుకున్నారు. పాస్ పోర్టు, వీసా వస్తే అక్కడికి వెళ్లడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని, ఎవరైన దాతలు సహాయం చేయాలని శ్రీనివాస్, సునీత అభ్యర్థిస్తున్నారు. శ్రీనివాస్ను 98498 32243 నంబరులో సంప్రదించి సహాయం అందించాలని కోరుతున్నారు.


