మంచిర్యాలఅర్బన్: 2001 నుంచి టీఆర్ఎస్లో చురుకై న కార్యకర్తగా ఉంటూ విద్యార్థి సంఘాలను ఏకం చేసి ఉద్యమంలో పోరు సాగించాడు మంచిర్యాలకు చెందిన సోహైల్ఖాన్. అతనిపై పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా 14 రోజుల పాటు జైలు జీవితం గడిపాడు. 2009, నవంబర్ 29న కేసీఆర్ను కరీంనగర్లో అరెస్ట్ చేసినప్పుడు ఉపాధ్యాయులతో నిరసన తెలిపే క్రమంలో అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి వస్తుండగా మొదటి కేసు నమోదైంది. ఉద్యమకారులపై అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా మంచిర్యాలలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టాడు. పోలీసులు అభ్యంతరం చెప్పటంతో రోడ్డుపై బైటాయించారు. గుండు గీయించుకుని నిరసన తెలపటంతో మరో కేసు నమోదైంది. సీమాంధ్ర నాయకుల పిండ ప్రదానాలు, అర్ధనగ్న ప్రదర్శనలు, శవయాత్రలు, దిష్టిబొమ్మల దహనం, రహదారుల దిగ్బంధనం, రైలురోకో, వంటవార్పు వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాడు. కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమకారులకు సరైన గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నాడు.


