అడ్మిషన్ల కోసం ప్రైవేట్ విద్యాసంస్థల పోటీ
పరీక్షలు పూర్తి కాకముందే ప్రచారం షురూ
కార్పొరేట్ సంస్థల రాకతో మారుతున్న తీరు
సర్కారు బడులపై ప్రభావం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రస్తుత విద్యాసంవత్సరం పరీక్షలు పూర్తి కాకముందే ప్రైవేటు విద్యాసంస్థలు ప్రవేశాల వేట మొదలుపెట్టాయి. ఇప్పటికే తమ విద్యాసంస్థల్లో చేరాలంటూ ప్రచారం సాగిస్తున్నాయి. నర్సరీ నుంచి పదో తరగతి వరకు స్కూళ్లలో ఓ వైపు వార్షిక పరీక్షలు నడుస్తుండగానే హడావుడి చేస్తున్నాయి. ప్రైవేటు టీచర్లకు ఒక్కొక్కరికి కొత్త అడ్మిషన్లు తీసుకు రావాలంటూ యాజమాన్యాలు లక్ష్యాన్ని నిర్ధేశిస్తున్నాయి. వేసవి సెలవులు ప్రారంభమైతే ఇంటింటికీ తిరిగి విద్యార్థుల ను చేర్పించేందుకు ప్రచా రం చేయాల్సి ఉంది.
పోటాపోటీ..
జిల్లా కేంద్రంలో కార్పొరేట్ విద్యాసంస్థల రంగ ప్రవేశంతో పరిస్థితి మారిపోతోంది. ఇంటర్నేషనల్, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్ కేటగిరీల వారీగా ప్రత్యేక కరిక్యులం పేరుతో విస్తృంతగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే విద్యార్థులను తమవైపు తిప్పుకునే పనిలో పడ్డాయి. టాలెంట్ టెస్టుల పేరుతో విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కొన్ని యాజమాన్యాలు వేసవిలో విద్యార్థుల కోసం ఉచితంగా పలు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నాయి. పీఆర్వోలను నియమించుకుని అడ్మిషన్ల కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. హైస్కూళ్ల కంటే ప్లే స్కూల్ నుంచి మొదలు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వంటి తరగతుల స్కూళ్లలో అధికంగా పోటీ నెలకొంది.
కాలేజీల ముందస్తు ఆఫర్లు
ఇక పదో తరగతి పూర్తవుతున్న విద్యార్థుల కోసం ఇప్పటికే కార్పొరేట్ కాలేజీలు స్థానికంగా ఉన్న కాలేజీలతోపాటు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నుంచి ఫోన్లలో మెసే జ్లు, ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడే ప్రవేశం పొందితే తక్కువ ఫీజులంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తమ పిల్లలు బాగా చదువుకోవాలని ఐఐటీ, నీట్, సివిల్స్, తదితర వాటిల్లో రాణించాలంటే ఆయా కోర్సుల్లో రూ.లక్షలు పోసి అడ్మిషన్లు చేయిస్తున్నారు.
తల్లిదండ్రుల తర్జనభర్జన
ప్రైవేటు స్కూళ్ల పోటీతో తల్లిదండ్రులు తర్జనభర్జన పడుతున్నారు. జిల్లా కేంద్రంతోపాటు బెల్లంపల్లి, మందమర్రి, రామక్రిష్ణాపూర్, లక్సెట్టిపేట పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో బడ్జెట్ పాఠశాలలే అధికంగా ఉండగా, జిల్లా కేంద్రంలో కార్పొరేట్ స్కూళ్లు ఉన్నాయి. గతంలో ఓ స్కూల్ తమకు సీబీఎస్ఈ గుర్తింపు ఉందంటూ ప్రచారం చేసుకుని తీరా అడ్మిషన్లు వచ్చాక మధ్యలో ఇంకా అనుమతి రాలేదని తెలిసి విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది ఓ స్కూల్లో పదో తరగతి వరకు బోధనకు అనుమతి ఉందంటూ చెప్పి తీరా అనుమతి రాకపోయే సరికి ఇటీవల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో తల్లిదండ్రులు ఏ స్కూల్లో చేర్పించాలనే తర్జనభర్జన పడుతున్నారు.
ప్రభుత్వ, స్థానిక సంస్థల
స్కూళ్లు, కాలేజీలు 694
విద్యార్థులు
38,298
ప్రభుత్వ గురుకులాలు
(అన్ని యాజమన్యాలు)120
విద్యార్థులు
22,195
మొత్తం విద్యార్థులు 71,829
ప్రైవేటు స్కూళ్లు 223
సీబీఎస్ఈ 02
కాలేజీలు 14
గురుకులాలకు పోటీ
ఉచిత బోధనతోపాటు వసతి, ఇతర సౌకర్యాలు కల్పించే గురుకులాలకు మాత్రం పోటీ పెరుగుతోంది. నాలుగో తరగతి నుంచే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, గురుకులాలు, అలాగే కస్తూ రిబాగాంధీ విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలు పోటీ పెరుగుతోంది. వేలాది మంది పేద, నిరుపేద విద్యార్థులకు రెసిడెన్షియల్ స్కూళ్లు వరంగా మారాయి. దీంతో చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు గురుకులాల ప్రవేశ పరీక్షలు రాయిస్తూ వసతిగృహాల్లో చేర్పించేందుకు ప్రోత్సహిస్తున్నారు.
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల వివరాలు
సర్కారు బడుల్లో మౌలిక వసతుల పెంపు కోసం గతంలో మన ఊరు–మన బడి, తాజాగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో పనులు సాగుతున్నాయి. మరుగుదొడ్లు, కిచెన్ షెడ్డులు, అదనపు తరగతి గదులు, వంటి సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. ఇక పీఎంశ్రీ పథకంలో ఎంపిక స్కూళ్లలో మరింతగా అభివృద్ధి జరుగుతున్నాయి. సర్కారు పరిధిలో పీఎంశ్రీ స్కూళ్లలో బడిబాట కింద నూతన అడ్మిషన్ల కోసం ప్రక్రియ ప్రారంభమైంది. కొన్ని చోట్ల ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు లేక మూతపడుతున్నాయి. చివరకు విద్యార్థులు లేక సమీప స్కూల్లోకి సర్దుబాటు చేస్తున్నారు. ప్రీ ప్రైమరీ ప్రవేశపెట్టడంతో విద్యార్థులు చేరే అవకాశం కలిగింది.


